IND vs BAN: వాడు వచ్చేశాడు.. ఇక వార్‌ వన్‌సైడే!

  • ఆరు నెలల పాటు బెంచ్‌కే పరిమితం
  • ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో సత్తాచాటినా నో యూజ్
  • కట్ చేస్తే ఆసియా కప్‌ 2025లో మ్యాజిక్‌
Kuldeep Yadav

Kuldeep Yadav

ఆసియా కప్‌ 2025కు ముందు ఆరు నెలల పాటు టీమిండియా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ బెంచ్‌కే పరిమితం అయ్యాడు. అన్ని సిరీస్‌లకు ఎంపికయినా.. తుది జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లలో కుల్దీప్ కేవలం రెండే వన్డేలు మాత్రమే ఆడాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో సత్తాచాటినా.. ఇంగ్లండ్‌తో అయిదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఒక్క మ్యాచ్ ఆడలేదు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌ 2025లో అవకాశం రావడమే ఆలస్యం.. ఆకలితో ఉన్న పులిలా విరుచుకుపడుతున్నాడు.

ఆసియా కప్‌ 2025లో యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్‌ తన మాయ చూపించాడు. 2.1 ఓవర్లలో 7 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 4 వికెట్లు పడగొట్టాడు. ఈ అద్భుత ప్రదర్శనతో ‘ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌’గా నిలిచాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్‌ చేసి 18 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లోనూ ‘ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌’ అవార్డును దక్కించుకున్నాడు. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక వికెట్స్ పడగొట్టాడు. సూపర్‌ 4లో భాగంగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ఒక్కో వికెట్‌ తీసినా పెద్దగా రన్స్ ఇవ్వలేదు.

Also Read: Sony Bravia 5 Price: జీఎస్టీ ఎఫెక్ట్‌.. 71 వేలు తగ్గిన సోనీ బ్రావియా టీవీ! పండగ ఆఫర్స్ అదనం

సూపర్‌ 4లో భాగంగా సెప్టెంబర్‌ 24న బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి కుల్దీప్ యాదవ్‌ పైనే ఉంది. మరోసారి అతడు మ్యాజిక్‌ చేయాలని భారత ఫాన్స్ కోరుకుంటున్నారు. ‘వాడు వచ్చేశాడు.. ఇక వార్‌ వన్‌సైడే’, ‘కుల్దీప్ యాదవ్‌ మాయ చేయడం ఖాయం’ అని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పటిలానే బంగ్లాదేశ్‌పై ఆరంభంలోనే వికెట్లు తీస్తే .. సునాయాస విజయం భారత్ సొంతమవుతుంది. భారీ ఆశలు పెట్టుకున్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి పెద్దగా రాణించలేదు. కీలక సమయంలో అయినా అతడు ఫామ్ అందుకుంటాడేమో చూడాలి.