IND vs AFG: భారత్, అఫ్గానిస్థాన్ మధ్య మూడు టీ20ల సిరీస్లో భాగంగా రెండో మ్యాచ్ నేడు (సెప్టెంబర్ 15) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7:30కు మొదలుకానుంది. తొలి టీ20లో భారీ విజయం సాధించిన టీమిండియా.. రెండో మ్యాచ్లోనూ అదే జోరును కొనసాగించి గెలిచి సిరీస్ను 2-0తో కైవసం చేసుకోవాలని చూస్తుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు భారత తుది జట్టులో ఎలాంటి మార్పులు ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తొలి టీ20లో భారత్ కొన్ని విభాగాల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ముఖ్యంగా ఐదో బౌలర్ విషయంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తాడన్నది కీలకంగా మారింది. గాయం నుంచి కోలుకుని జట్టులోకి తిరిగొచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి ఇంకా పూర్తిస్థాయి ఫామ్లో ఉన్నట్లు కనిపించలేదు. మరోవైపు శివమ్ దూబే వేసిన చివరి ఓవర్లో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అభిషేక్ శర్మ ఒక ఓవర్ వేసి పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ.. అతడితో ఒకటి కంటే ఎక్కువ ఓవర్లు వేయించగలమా అన్నది ప్రశ్నగానే ఉంది.
ఇక బ్యాటింగ్ విభాగంలో అందరి దృష్టి సంజూ శాంసన్, వైభవ్ సూర్యవంశీపై ఉంది. జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్లో అద్భుతంగా రాణించి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచిన వైభవ్కు అఫ్గానిస్థాన్తో తొలి టీ20లో అవకాశం దక్కలేదు. అతడి స్థానంలో ఓపెనర్గా బరిలోకి దిగిన సంజూ శాంసన్ 8 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసి స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. దీంతో రెండో టీ20లో సంజూ స్థానంలో వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే టీమ్ మేనేజ్మెంట్ సంజూపై మరోసారి నమ్మకం ఉంచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక్క మ్యాచ్లో విఫలమైనందుకు అనుభవజ్ఞుడైన సంజూను పక్కన పెట్టకుండా మరో అవకాశం ఇవ్వొచ్చని అంచనా.
మరోవైపు ఇషాన్ కిషన్ కూడా జట్టులో ఉండడంతో జట్టు బ్యాటింగ్ కాంబినేషన్పై మరింత ఆసక్తి నెలకొంది. శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్తో మిడిలార్డర్ బలంగా ఉంది. బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి ఎలాగూ కీలక పాత్ర పోషించనున్నారు. ఇక అఫ్గానిస్థాన్ విషయానికి వస్తే.. రహ్మానుల్లా గుర్బాజ్, సదిఖుల్లా అటల్, ఇబ్రహీం జద్రాన్, దర్విష్ రసూలీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ వంటి ఆటగాళ్లతో జట్టు బలంగా ఉంది. తొలి మ్యాచ్లో ఎదురైన పరాజయం నుంచి పుంజుకుని సిరీస్ను సమం చేయాలని అఫ్గాన్ కూడా భావిస్తోంది.
భారత్ ఈ మ్యాచ్లో గెలిస్తే మూడు టీ20ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సొంతం చేసుకుంటుంది. దీంతో వైభవ్ సూర్యవంశీకి అవకాశం దక్కుతుందా.? లేక సంజూ శాంసన్పైనే మరోసారి నమ్మకం ఉంచుతారా.? అన్నది టాస్ సమయంలో తేలనుంది.
టీమిండియా ప్లేయింగ్ XI:
సంజూ శాంసన్ / వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
అఫ్గానిస్థాన్ ప్లేయింగ్ XI:
సదిఖుల్లా అటల్, రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, దర్విష్ రసూలీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్హక్ ఫారూఖీ, నవీన్ ఉల్ హక్.

