ఢిల్లీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో ఓ ఎంటెక్ విద్యార్థి మృతి చెందాడు. విద్యార్థి తన హాస్టల్ గదిలోనే ఉరివేసుకుని మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. దేశవ్యాప్తంగా ఐఐటీ విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం రేకెత్తిస్తున్నాయి. వివరాల ప్రకారం…
మహారాష్ట్రలోని నాశిక్కు చెందిన సంజయ్ నెర్కర్ (24) అనే విద్యార్థి ఎంటెక్ చదువుతున్నాడు. ద్రోణాచార్య హాస్టల్లోని రూం నంబర్ 757లో ఉండేవాడు. నెర్కర్ కుటుంబ సభ్యులు గురువారం రాత్రి అతనికి కాల్ చేశారు. నెర్కర్ ఫోన్ తీయకపోవడంతో.. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అతడి హాస్టల్ మేట్లకు సమాచారం ఇచ్చారు. విద్యార్థులు అతని గదికి వెళ్లి చూడగా.. లోపల నుంచి తాళం వేసి ఉంది. వారు హాస్టల్ గార్డుకు సమాచారం అందించగా.. అతను తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా నెర్కర్ మృతదేహం వేలాడుతూ కనిపించింది.
Also Read: Rajdhani Files: ‘రాజధాని ఫైల్స్’ విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్!
హాస్టల్ గార్డు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని, మృతికి గల కారణాలపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. అంతకుముందు న్యూఢిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ (ఎంఎఎంసీ)లోని తన హాస్టల్ గదిలో ఓ 23 ఏళ్ల వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.