Antivenom: పాముకాటు అనేది మనదేశంలో ఎంతోమంది ప్రాణాలను తీస్తున్న అతిపెద్ద సమస్య. ఏటా వేలాది మంది దీనికి బలవుతుంటే, మరికొందరు జీవితాంతం వికలాంగులుగా మారుతున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 50,000 మంది పాముకాటు వల్ల చనిపోతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇంత పెద్ద విపత్తు వెనుక ఉన్న ప్రధాన కారణం మన దగ్గర ఉన్న పురాతన విష నిరోధక వైద్య విధానమే. ఇప్పటివరకు గుర్రాలకు పాము విషాన్ని ఎక్కించి తయారుచేసే సాంప్రదాయ యాంటీవెనమ్పైనే ఆధారపడుతున్నాం. ఈ పద్ధతి వంద ఏళ్ల క్రితం నాటిది కావడం, బ్యాచ్కి బ్యాచ్కి నాణ్యత మారడం, తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ రావడం, ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉండటంతో పాటు కొన్ని రకాల పాములకు మాత్రమే పనిచేయడం అతిపెద్ద ప్రతిబంధకంగా మారింది. ప్రతి పాము విషంలో ఉండే రసాయనాలు వేర్వేరుగా ఉండటంతో, వీటన్నింటికీ కలిపి ఒకే విరుగుడు కనుగొనడం శాస్త్రవేత్తలకు ఎన్నో ఏళ్లుగా పెద్ద సవాలుగా నిలిచింది.
ఈ సమస్యకు ముగింపు పలుకుతూ బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc), డెన్మార్క్ టెక్నికల్ యూనివర్సిటీ (DTU) పరిశోధకులు ఒక సరికొత్త రికంబినెంట్, నానోబోడీ ఆధారిత యాంటీవెనమ్ను అభివృద్ధి చేశారు. ల్యాబ్లోని మైక్రోబియల్ విధానాల ద్వారా మానవీకరించిన యాంటీబాడీలను ఉత్పత్తి చేయడం వల్ల, గుర్రాలను పదే పదే ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఇక ఉండదు. ఈ పరిశోధన వివరాలు ‘సైన్స్ ట్రాన్స్లేషనల్ మెడిసిన్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి. వివిధ రకాల నాగుపాములు, కాళింగ సర్పాలు (కింగ్ కోబ్రా) విషం నుంచి ఒకేసారి రక్షణ కల్పించే ఈ విరుగుడు వైద్యరంగంలో ఒక విప్లవాత్మక పురోగతి అని సైంటిస్టులు చెప్తున్నారు. ఈ అద్భుతాన్ని సాధించడానికి పరిశోధకులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించారు. గతంలో ఒంటె జాతికి చెందిన ల్యామాలు, ఆల్పాకాలకు ఆఫ్రికన్ పాముల విషాన్ని ఎక్కించినప్పుడు వాటి రక్తంలో తయారైన శక్తివంతమైన యాంటీబాడీలను పరిశీలించారు.
ఇక, యాంటీబాడీలు సాధారణంగా Y ఆకారంలో ఉంటాయి. వీటి చివరి భాగంలో ఉండే తేలికపాటి ప్రొటీన్ ముక్కలే (నానోబోడీలు) విషాన్ని నేరుగా బంధిస్తాయి. పరిశోధకులు అలాంటి ఐదు ప్రత్యేక నానోబోడీల కాక్టైల్ను తయారు చేసి, భారతదేశంలోని నాగుపాముల విషంపై టెస్ట్ చేశార. ఆశ్చర్యకరంగా, ఇవి మన దేశంలోని నాగుపాముల విషంలోని విషపదార్థాలను కూడా పూర్తిగా నిర్వీర్యం చేయడమే కాకుండా, విషం శరీరంలోకి వెళ్లి కణాలకు అంటుకోకుండా అడ్డుకోగలిగాయి. ఎలుకలపై చేసిన ప్రయోగాలు ఈ కొత్త మందు సామర్థ్యాన్ని నిరూపించాయి. నాగుపాము, కింగ్ కోబ్రా పాముల విషం ఎక్కించిన ఎలుకలకు ఈ నానోబోడీ మిశ్రమాన్ని ఇవ్వగా అవి సురక్షితంగా కోలుకున్నాయి. విషం ఎక్కించిన 30 నిమిషాల తర్వాత ఈ యాంటీవెనమ్ ఇచ్చినప్పటికీ, పక్షవాతం వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎలుకలు సైతం సాధారణ స్థితికి చేరుకోవడం విశేషం. సాధారణంగా మోనోక్లోనల్ యాంటీబాడీలను ఎక్కువ పరిమాణంలో ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి వైద్యానికి ఖర్చు, సురక్షితతపై సందేహాలు ఉండేవి. కానీ, చాలా చిన్న మోతాదులోనే ఈ నానోబోడీలు విషాన్ని సమర్థవంతంగా అడ్డుకోగలవని నిరూపితమైంది. ఇది మనుషులకు వాడేటప్పుడు అయ్యే ఖర్చును, సైడ్ ఎఫెక్ట్స్ను గణనీయంగా తగ్గిస్తుంది. ఈ విధానం భవిష్యత్తులో స్థానిక పాముల తీవ్రతను బట్టి ప్రాంతాల వారీగా యాంటీవెనమ్ను సులభంగా తయారుచేసుకోవడానికి ఒక బ్లూప్రింట్లా ఉపయోగపడుతుందని పరిశోధకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

