Udayanidhi Stalin: సనాతన ధర్మంపై వ్యాఖ్యల విషయంలో తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వెనక్కి తగ్గడం లేదు. డీఎంకే నేత, తమిళనాడు క్రీడలు, యువజన సంక్షేమ శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోసారి సనాతన ధర్మం నిర్మూలనపై మాట్లాడారు. సనాతన ధర్మంపై విషం చిమ్ముతూనే, సనాతన నిర్మూలనతోనే అంటరానితనం కూడా అంతం అవుతుందని చెప్పారు. అంటరానితనం అంతం కావాలంటే సనాతన ధర్మాన్ని నిర్మూలించాల్సి అవసరం ఉందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ అన్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తే అంటరానితనం కూడా స్వయంచాలకంగా అంతమవుతుందన్నారు.
రాష్ట్రంలో సామాజిక వివక్షపై తమిళనాడు గవర్నర్ చేసిన వ్యాఖ్యపై ఆయన మంగళవారం స్పందిస్తూ ఈ ప్రకటన చేశారు. తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో కుల ప్రాతిపదికన సామాజిక వివక్ష ఇప్పటికీ కనిపిస్తోందని గత వారం ఒక సాంస్కృతిక కార్యక్రమంలో గవర్నర్ రవి అన్నారు. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులో సామాజిక వివక్ష ఎక్కువగా ఉందని ఆర్ఎన్ రవి ఆరోపించారు. అయితే గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ స్పందిస్తూ మరోసారి సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Also Read: Supreme Court: పార్లమెంట్, అసెంబ్లీలో అవినీతి.. 1998 తీర్పు పున:పరిశీలన
అయితే అంతకుముందు సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా, కరోనా వైరస్ లాంటిదని.. ఇలాంటి వాటిని కేవలం వ్యతిరేకిస్తేనే సరిపోదని.. దాన్ని నిర్మూలించేవరకు వదిలిపెట్టకూడదని ఆయన సూచించారు. అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించిన మద్రాస్ హైకోర్టు.. రాజ్యంగంలో పౌరులకు కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛ అనేది విద్వేషపూరితం కాకూడదని సూచించింది. ముఖ్యంగా మతానికి సంబంధించిన అంశాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది.
Also Read: Donald Trump: డొనాల్డ్ ట్రంప్ చనిపోయాడు.. కలకలం రేపిన ట్రంప్ కుమారుడి పోస్ట్!
సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా, కరోనా వంటి వ్యాధుల లాంటిదని కొంతకాలం క్రితం సనాతన్ నిర్మూలన్ సమ్మేళన్లో ఉదయనిధి చెప్పడం గమనార్హం. కొన్ని విషయాలను వ్యతిరేకించలేము. దాన్ని పూర్తిగా నాశనం చేయాలన్నారు. దీన్ని ప్రచారం చేయడం ద్వారా మానవత్వం, మానవ సమానత్వం నిలిచిపోతుందని సనాతన ధర్మాన్ని నిందించారు. ఆయన సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉదయనిధిపై బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ స్పందిస్తూ.. దేశంలోని 80 శాతం మంది హిందువులను నాశనం చేశారని డీఎంకే నేతలు మాట్లాడుతున్నారని అన్నారు.