ICC Women’s Champions Trophy 2027: మహిళల క్రికెట్‌లో కొత్త చరిత్ర.. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం.. తేదీలు ఖరారు

Icc Women's Champions Troph

Icc Women's Champions Troph

ICC Women’s Champions Trophy 2027: మహిళల క్రికెట్ అభిమానులకు ఐసీసీ శుభవార్త అందించింది. 2027లో తొలిసారిగా నిర్వహించనున్న ఐసీసీ మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధికారికంగా ప్రకటించింది. టోర్నమెంట్ 2027 ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు జరగనుంది.

ముంబై, వడోదరలో మ్యాచ్‌లు
మహిళల ఛాంపియన్స్ ట్రోఫీలోని అన్ని మ్యాచ్‌లు భారత్‌లోని రెండు చారిత్రాత్మక క్రికెట్ వేదికల్లో నిర్వహించనున్నారు. ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (బ్రాబోర్న్ స్టేడియం), వడోదర అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

శ్రీలంక నుంచి భారత్‌కు ఎందుకు మార్చారు?
తొలుత ఈ టోర్నమెంట్‌ను శ్రీలంకలో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC)లో కొనసాగుతున్న పరిపాలనా సంస్కరణల నేపథ్యంలో ఆతిథ్య వేదికను మార్చాలని ఐసీసీ నిర్ణయించింది. ఆతిథ్యం కోసం భారత్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా సమర్పించిన బిడ్లను పరిశీలించిన ఐసీసీ.. భారత్ బిడ్‌కు ఆమోదం తెలిపింది. సెప్టెంబర్ 2న ఐసీసీ బోర్డు భారత్ ఆతిథ్యాన్ని ధృవీకరించింది.

ఆరు అగ్రశ్రేణి జట్లతో పోటీ
తొలి మహిళల ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం ఆరు ప్రపంచ స్థాయి జట్లు పాల్గొంటాయి. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు టోర్నమెంట్‌లో బరిలోకి దిగనున్నాయి. జూలై 6 నాటి ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా ఈ ఆరు జట్లను ఎంపిక చేశారు. అన్ని జట్లు రౌండ్-రాబిన్ విధానంలో మిగిలిన జట్లతో తలపడతాయి. లీగ్ దశ ముగిసిన తర్వాత పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు ఫిబ్రవరి 28న జరిగే ఫైనల్‌లో తలపడతాయి.

మహిళల క్రికెట్‌లో కొత్త అధ్యాయం
ఐసీసీ అధ్యక్షుడు జయ్ షా మాట్లాడుతూ.. 2027 మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ మహిళల క్రికెట్‌లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని అన్నారు. తొలి ఎడిషన్‌లో ప్రపంచంలోని అత్యుత్తమ జట్లు హోరాహోరీగా తలపడనున్నాయని తెలిపారు. అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌ను మెరుగుపరుచుకోవడంతో పాటు ప్రపంచ వేదికపై తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ టోర్నమెంట్ జట్ల మధ్య పోటీని పెంచుతుందని ఐసీసీ పేర్కొంది.