హైదరాబాద్ నగరంలో చోటుచేసుకున్న ఒక వింత, విడ్డూరమైన సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో తెగ చక్కర్లు కొడుతోంది. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు, నెటిజన్లు ఈ దృశ్యాన్ని చూసి అవాక్కవుతున్నారు. అయితే.. ఈ వ్యవహారం కాస్త తీవ్రరూపం దాల్చడంతో దీనిపై సీపీ సజ్జనార్ స్పందించారు.
ల్యాప్టాప్తో ‘వర్క్ ఫ్రమ్ బైక్’ ప్రయాణం..
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. హైదరాబాద్లోని ఒక బిజీ రోడ్డుపై యువకుడు బైక్ నడుపుతున్నాడు. కానీ, అందరి దృష్టి అతడి డ్రైవింగ్ కంటే కూడా బైక్ ఫ్యూయల్ ట్యాంక్పై ఉన్న వస్తువు వైపు ఉంది. ఆ యువకుడు బైక్ ట్యాంక్పై ల్యాప్టాప్ ఉంచి.. ప్రయాణంలోనూ ఆఫీస్ పనిలో మునిగిపోయాడు. రోడ్డుపై వేగంగా బైక్ వెళ్తుండగా, ల్యాప్టాప్ స్క్రీన్ ఓపెన్ చేసి ఉండి, అతడు దానిని చూస్తూ డ్రైవింగ్ చేయడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. పక్కన వెళ్తున్న ఇతర వాహనదారులు ఈ నిర్లక్ష్యపు డ్రైవింగ్ను చూసి షాక్కు గురయ్యారు. రోడ్డుపై వెళ్తున్న ఒక వ్యక్తి ఈ ప్రమాదకరమైన దృశ్యాన్ని తన మొబైల్ కెమెరాలో బంధించడంతో ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది.
సోషల్ మీడియాలో నెటిజన్ల ‘రకరకాల’ కామెంట్లు..
ఈ వీడియో బయటకు రాగానే సోషల్ మీడియా యూజర్లు దీనిని భిన్న కోణాల్లో విశ్లేషిస్తూ విపరీతంగా షేర్ చేస్తున్నారు. చాలా మంది నెటిజన్లు దీనికి సరదాగా ‘వర్క్ ఫ్రమ్ బైక్’ అని పేరు పెట్టారు. “ఆఫీస్ లేదు, ఇల్లు లేదు.. ఇదో సరికొత్త ట్రెండ్” అని కొందరు కామెంట్లు పెడుతుండగా.. మరికొందరు “వర్క్ ఫ్రమ్ హోమ్ పాతబడింది.. వర్క్ ఫ్రమ్ బైక్ కొత్తగా వచ్చింది” అంటూ జోకులు పేల్చుతున్నారు. ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి సినిమాల్లోని స్టంట్స్తో దీనిని పోల్చుతున్నారు.
ఐటీ రంగంలో ఉద్యోగులపై పెరుగుతున్న పని ఒత్తిడికి ఈ దృశ్యం అద్దం పడుతుందని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ డెడ్లైన్లు, పోటీ తట్టుకోలేక రోడ్డుపై కూడా ల్యాప్టాప్లు ఓపెన్ చేయాల్సి వస్తోందని విమర్శించారు. ఈ వైరల్ వీడియోపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన వీసీ సజ్జనార్, సదరు యువకుడి ప్రవర్తనను తీవ్రంగా తప్పుపట్టారు. రోడ్లపై ప్రయాణించేటప్పుడు ఇలాంటి బాధ్యతారాహిత్యమైన పనులు చేయడం అస్సలు మంచిది కాదని హితవు పలికారు.
“బైక్ నడుపుతూ ల్యాప్టాప్లో పని చేయడం వంటి నిర్లక్ష్యపు చర్యలు ప్రాణాంతకం. వాహనం నడిపేటప్పుడు పూర్తి శ్రద్ధ కేవలం రోడ్డు, ట్రాఫిక్పైనే ఉండాలి. ఇలాంటి విన్యాసాలు బైక్ నడిపే వ్యక్తి ప్రాణాలకే కాకుండా, రోడ్డుపై వెళ్లే ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు తెచ్చిపెడతాయి” అని ఆయన హెచ్చరించారు.
WORK FROM BIKE: HYDERABAD MAN SPOTTED WITH LAPTOP ON FUEL TANK OF VEHICLE, VIDEO VIRAL pic.twitter.com/dKtTHQmfg2
— Ghar Ke Kalesh (@gharkekalesh) June 13, 2026
రహదారి భద్రతపై ఆందోళన..
ఒకవైపు ఈ వీడియో నవ్వులు పూయిస్తున్నప్పటికీ.. ఇలాంటి ప్రమాదకరమైన పనులను ఏమాత్రం ప్రోత్సహించకూడదని ట్రాఫిక్ నిపుణులు, సామాన్యులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఒక్క క్షణం శ్రద్ధ తప్పినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని, సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం లేదా ఆఫీస్ పని కోసం ప్రాణాలను పణంగా పెట్టవద్దని నెటిజన్లు ఈ వీడియో కింద కామెంట్ల రూపంలో హెచ్చరిస్తున్నారు.

