Vinayaka Nimajjanam: హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ శనివారం నిర్వహించనున్న వినాయక నిమజ్జనంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ గణేష్ పండగ చాలా ముఖ్యమైనదని, ఇరవై వేల గణేష్ విగ్రహాలు నిమజ్జనం అవుతాయన్నారు. నిమజ్జనం సాఫీగా జరగడానికి అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటున్నట్లు చెప్పారు. వినాయక నిమజ్జనం తమకు ఛాలెంజింగ్ అని బందోబస్తు కోసం నెల రోజుల ముందు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుందని తెలిపారు. రూట్ ఇన్స్ఫెక్షన్స్ చేసి ఆయా విభాగాలకు అవసరమైన సూచనలు ముందుగానే చేశామన్నారు. విగ్రహాలు అమ్మే దుల్పేట్ లాంటి ప్రాంతాల్లో కూడా ప్రణాళిక బద్ధంగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
READ ALSO: సాక్షి అగర్వాల్ ఓణం స్పెషల్ : సోషల్ మీడియాను ఊపేసిన ఫోటోలు!
రెండు షిఫ్ట్ల్లో బందోబస్తు డ్యూటీ..
3200 మంది ట్రాఫిక్ సిబ్బంది రెండు షిఫ్ట్ల్లో గణేష్ బందోబస్తు విధుల్లో ఉంటారని చెప్పారు. వినాయక నిమజ్జనంకు పది వేల పైగా టస్కర్ వాహనాలు వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. సుమారుగా పది లక్షల మంది భక్తులు నిమజ్జనంలో పాల్గొనే అవకాశం ఉంది అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉదయం ఆరు గంటలకు బడా గణేష్ శోభాయాత్ర స్టార్ట్ అవుతుందని, నాలుగో నెంబర్ క్రేన్ వద్ద 12 గంటలకు కంత నిమజ్జనం పూర్తి అయ్యే అవకాశం ఉందని చెప్పారు. బడా గణేష్ నిమజ్జనం చూడటానికి వచ్చేవారు వ్యక్తిగత వాహనాలు కాకుండా ప్రజా రవాణా వినియోగించాలి అని సూచించారు. నిమజ్జనానికి వచ్చే వాహనాల కోసం ఎన్టీఆర్ స్టేడియం, కట్టమైసమ్మ దేవాలయం, పబ్లిక్ గార్డెన్స్, బుద్దభవన్ వెనుక, ఆదర్శనగర్, బీఆర్కే భవన్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్ వద్ద పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి..
వినాయక విగ్రహాలు వచ్చే రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి ప్రజలు గమనించాలని సూచించారు. బాలాపూర్ నుంచి వచ్చే ప్రధాన శోభాయాత్ర చార్మినార్, అబిడ్స్, లిబర్టీ, ట్యాంక్ బండ్ మీదుగా నెక్లెస్ రోడ్ వైపు వెళ్తుందని చెప్పారు. ఆయా రూట్లో జనరల్ ట్రాఫిక్ అనుమతి ఉండదని పేర్కొన్నారు. సికింద్రాబాద్ నుంచి వచ్చే విగ్రహాలు ప్యాట్నీ, పారడైజ్, రాణిగంజ్, కర్బలామైదాన్ నుంచి ట్యాంక్బండ్కు చేరుకుంటాయని, టోలిచౌకీ, మెహిదీపట్నం నుంచి వచ్చేవి ఖైరతాబాద్ మీదుగా నెక్లెస్ రోడ్ చేరుకుంటాయని చెప్పారు. టప్పచబుత్ర, ఆసిఫ్ నగర్ నుంచి వచ్చే విగ్రహాలకు ఎంజే మార్కెట్లోకి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రధాన నిమజ్జన రూట్లలో సాధారణ వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపి వేస్తున్నట్లు పేర్కొన్నారు. సౌత్ ఈస్ట్ జోన్ కేశవగిరి, చాంద్రాయణగుట్ట, మూసారాంబాగ్, చంచల్గూడ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు మళ్లింపులు ఉంటాయని చెప్పారు. అలియాబాద్, మదీనా, నయాపూల్, ఎంజే మార్కెట్, దరుశిఫా ప్రాంతాలలో ట్రాఫిక్ను మళ్లింపులు ఉంటాయని తెలిపారు. శివాజీ బ్రిడ్జ్, పుత్లీబౌలి, హిమాయత్నగర్, వైఎంసీఏ, లిబర్టీ, అబిడ్స్, ఖైరతాబాద్, ట్యాంక్బాండ్, బుద్ధభవన్ జంక్షన్లలో వాహనాలను అనుమతించరని చెప్పారు.
ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలి..
ట్రాఫిక్ ఆంక్షలు దృష్టా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. విమానాశ్రయానికి వెళ్లేవారు పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్వే లేదా ఔటర్ రింగ్ రోడ్ మాత్రమే ఉపయోగించాలి అన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్లేవారు బేగంపేట, పారడైజ్ మార్గాన్ని ఎంచుకోవాలని చెప్పారు. చిన్న విగ్రహాలు తీసుకుని వచ్చే వారు వారికీ కేటాయించిన బేబీ ఫాండ్లలో నిమజ్జనం చేయాలని కోరారు. నిమజ్జనం కోసం వాహనాలు కదిలే తీరును రెండు డ్రోన్లు,14 ప్రాంతాల్లో హై రేంజ్ కెమెరాలు ద్వారా పర్యవేక్షిస్తామని చెప్పారు. కమాండ్ కంట్రోల్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండటమే కాకుండా క్షేత్ర స్థాయి సిబ్బందికి సూచనలు ఇస్తామని చెప్పారు. గత నాలుగు రోజుల నుంచి ప్రైవేట్ బస్సులను సిటీలోకి అనుమతించడం లేదని చెప్పారు. ఆర్టీసీ బస్సులకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. గూగుల్ మ్యాప్స్ ద్వారా రియల్ టైమ్ ట్రాఫిక్ అప్డేట్స్ జనాలకు అందిస్తామని చెప్పారు. భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు ట్రాఫిక్ పోలీసులతో సహకరించాలని సూచించారు. ప్రత్యేకంగా హెల్ప్ లైన్ నంబర్లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిమజ్జనం పూర్తయిన తర్వాత లారీలు నగరంలోకి రాకుండా ఔటర్ రింగ్ రోడ్ మీదుగా మాత్రమే అనుమతిస్తారని చెప్పారు.
READ ALSO: AP Assembly Sessions: ఈ నెల 18 నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. వైసీపీ హాజరుపై ఉత్కంఠ!
