Night Bus Services: హైదరాబాద్‌లో నైట్ బస్ సర్వీసులు.. సెప్టెంబర్ 1 నుంచి ఈ 6 రూట్లలో ప్రారంభం..

Tgsrtc

Tgsrtc

హైదరాబాద్ మహానగరంలో రాత్రి వేళల్లో ప్రయాణించే పౌరులు, ఐటీ ఉద్యోగులు , నైట్ షిఫ్ట్ సిబ్బంది సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 1 నుంచి నగరంలోని 6 ప్రధాన రూట్లలో నైట్ బస్ సర్వీసులను పునరుద్ధరించనున్నట్లు అధికారులు వెల్లడించారు. రాత్రి 10:00 గంటల నుంచి ఉదయం 5:00 గంటల వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా మహిళా ప్రయాణికులకు మహాలక్ష్మి పథకం కింద ఈ నైట్ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం వర్తిస్తుండటం విశేషం.

రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లకు ఆలస్యంగా చేరుకునే దూరప్రాంత ప్రయాణికులతో పాటు హోటళ్లు, షాపింగ్ మాల్స్, ఐటీ కారిడార్లలో రాత్రి వేళల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ నిర్ణయం ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రతి 30 నిమిషాల నుంచి గంటకు ఒక బస్సు చొప్పున సర్వీసులను నడపనున్నారు.

నైట్ బస్ రూట్లు, సర్వీసుల వివరాలు ఇలా.. 

బస్సు నంబర్ 10H (సికింద్రాబాద్ ↔ కొండాపూర్): సికింద్రాబాద్ నుంచి హైటెక్ సిటీ మీదుగా కొండాపూర్ వరకు ఈ బస్సులు తిరుగుతాయి. రాత్రి వేళల్లో ప్రతి 30 నిమిషాల నుంచి గంటకు ఒక సర్వీస్ చొప్పున మొత్తం 8 నుంచి 10 సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

బస్సు నంబర్ 195W (బాచుపల్లి ↔ వేవ్‌రాక్): బాచుపల్లి నుంచి రాయదుర్గం, గచ్చిబౌలి మీదుగా వేవ్‌రాక్ వరకు నడిచే ఈ బస్సు ఐటీ ఉద్యోగులకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి గంటకు ఒక సర్వీస్ నడుస్తుంది.

బస్సు నంబర్ 290U (సికింద్రాబాద్ ↔ హయత్‌నగర్): రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ ఎదురుగా ప్రారంభమై ఎల్బీనగర్, వనస్థలిపురం, ఎన్జీవోస్ కాలనీ మీదుగా హయత్‌నగర్ చేరుకుంటుంది.

బస్సు నంబర్ 218 (కోఠి ↔ పటాన్‌చెరు): కోఠి, అబిడ్స్ పరిసర ప్రాంతాల నుంచి పటాన్‌చెరు వరకు ఈ నైట్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది.

బస్సు నంబర్ 222A (కోఠి ↔ పటాన్‌చెరు): కోఠి నుండి హైటెక్ సిటీ మీదుగా పటాన్‌చెరు వరకు అత్యధిక రద్దీ ఉండే ఈ రూట్‌లో ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి ప్రతి 30 నుండి 60 నిమిషాలకు ఒక బస్సు నడుస్తుంది.

బస్సు నంబర్ 219 (సికింద్రాబాద్ ↔ పటాన్‌చెరు): సికింద్రాబాద్ నుంచి పటాన్‌చెరు మార్గంలో నైట్ సర్వీస్ నిర్వహణకై అధికారులు ఇప్పటికే మార్గాన్ని పరిశీలించారు.

ఈ నైట్ సర్వీసుల వల్ల అర్ధరాత్రి వేళల్లో ఆటోలు, క్యాబ్‌లను ఆశ్రయించి అధిక ఛార్జీలు చెల్లించే భారం ప్రయాణికులకు తగ్గనుంది.