Kalma Homework: స్కూల్‌లో ‘కల్మా’ హోంవర్క్ వివాదం.. బీజేపీ నేతల ఆగ్రహం..!

Kalma

Kalma

Kalma Homework: హైదరాబాద్‌ నగరంలోని సైదాబాద్‌లో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి హిందూ విద్యార్థికి ‘కల్మా’ చదవాలని, ఖురాన్‌ లోని భాగాన్ని హోంవర్క్‌గా ఇచ్చారనే ఆరోపణలు వివాదానికి దారితీశాయి. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించారు. అయితే విషయం వెలుగులోకి రావడంతో సంబంధిత టీచర్‌ను యాజమాన్యం సస్పెండ్ చేసినట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై తెలంగాణ బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అందిన సమాచారం ప్రకారం.. సైదాబాద్‌లోని సక్సెస్ స్కూల్‌లో రెండో తరగతి చదువుతున్న ఓ హిందూ విద్యార్థికి ‘కల్మా’ చదవాలని, ఖురాన్‌కు సంబంధించిన పాఠాన్ని హోంవర్క్‌గా ఇచ్చినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో వారు పాఠశాలకు చేరుకుని యాజమాన్యాన్ని నిలదీశారు. విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే సంబంధిత ఆయేషా అనే టీచర్‌ పై స్కూల్ యాజమాన్యం చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది.

ఈ ఘటనపై స్పందించిన పాఠశాల యాజమాన్యం, తమ పాఠశాలలో ఎలాంటి మతపరమైన బోధనలు నిర్వహించడం లేదని స్పష్టం చేసింది. విద్యార్థులకు కేవలం విద్య మాత్రమే అందిస్తున్నామని పేర్కొంది. ఈ ఘటన గురించి ముందుగా తమకు సమాచారం లేదని, విషయం తెలిసిన వెంటనే సంబంధిత టీచర్‌పై చర్యలు తీసుకున్నామని తెలిపింది. పాఠశాలలో ఎక్కువ మంది ముస్లిం విద్యార్థులు ఉన్నప్పటికీ, మతపరమైన బోధనలకు తావు లేదని యాజమాన్యం వెల్లడించింది.

మరోవైపు ఈ ఘటనపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో స్పందించారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కొన్ని పాఠశాలల్లో హిందూ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని మత మార్పిడికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇలాంటి ఘటనలపై జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ జరిపి, అవసరమైతే సంబంధిత పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కూడా ఈ ఘటనను ఖండించారు. హిందూ సంస్కృతిపై దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, పాఠశాల యాజమాన్యంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై సమాజం మొత్తం స్పందించాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మాట్లాడుతూ.. విద్యార్థులపై ఎలాంటి మతపరమైన ఒత్తిళ్లు తీసుకురావడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. సంబంధిత పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, అవసరమైతే గుర్తింపు కూడా రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.