Spoiled Meat: నాన్ వెజ్ ప్రియుల్లారా… తస్మాత్ జాగ్రత్త!! చికెన్… మటన్… పాయ.. బోటీ.. అంటూ లొట్టలేసుకుని తింటున్నారా..? ఐతే మీ జీవితానికి కాలంచెల్లినట్టే. మీరు తింటుంది నాన్ వెజ్ కాదు.. కాలకూట విషం. తిన్నారంటే పాడెక్కాల్సిందే !! నగరంలోని ఓ గోదాంలో ఏకంగా 14 వేల కిలోల కుళ్లిన మాంసం పట్టుకున్నారు అధికారులు. సిటీలో వందలాది హోటళ్లు, రెస్టారెంట్లకు ఇక్కడి నుంచే మాంసం సప్లై అవుతోందట !! అంటే మీరు తిన్న మాంసం కూడా ఈ కుళ్లిపోయిన మాంసమే అయి ఉంటుంది.
ఓల్డ్ సిటీ.. మంగళ్ హాట్ పరిధిలోని ఏ టూ జెడ్ షీప్ అండ్ గోట్ ఆఫల్స్ పేరుతో మాంసం వ్యాపారం నిర్వహిస్తున్నాడు అఫ్రోజ్. ఓ గోదాంను అడ్డాగా చేసుకుని పాడైపోయిన, కుళ్లిపోయిన మాంసాన్ని హోల్ సేల్ పేరుతో అమ్ముతున్నాడు. ఈ గోదాంపై హెచ్ ఫాస్ట్ అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి గోల్కొండ టాస్క్ఫోర్స్ అధికారులు సోదాలు జరిపారు. గోదాంలో ఏకంగా 14 వేల కిలోల కుళ్లిపోయిన మాంసాన్ని గుర్తించారు. అంతా… మేక మాంసం, గొర్రె మాంసం. ఇందులో బోటీ… ఖార్జం.. పాయ.. కాళ్లు… తలకాయ.. మటన్… ఇలా అన్ని రకాల వెరైటీలు ఉన్నాయి.
సంచుల్లో, బకెట్లలో కుప్పలుకుప్పలుగా ఉన్న మాంసాన్ని చూసి అధికారులే షాక్ అయ్యారు. వేల కిలోల మాంసాన్ని వారాల తరబడి నిల్వ ఉంచుతున్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ, జమ్ము కాశ్మీర్ రాష్ట్రాల నుంచి మాంసాన్ని హైదరాబాద్కి దిగుమతి చేసుకుని… మంగళ్ హాట్లో అక్రమంగా నిల్వ ఉంచుతున్నాడు అఫ్రోజ్. ఈ మాంసం ఎన్ని వారాలు నిల్వ ఉంచినా… కుళ్లిపోయిన వాసన రాకుండా, గట్టిపడకుండా… హానికర కెమికల్స్ కలుపుతున్నారు. మాంసాన్ని నీటిలో నానబెట్టి… కెమికల్స్ కలిపి… సంచుల్లో ప్యాక్ చేసి… ఫ్రీజర్లలో స్టోర్ చేస్తున్నారు.
ఈ మాంసాన్ని హోల్ సేల్ పేరుతో నగరంలోని వందలాది రెస్టారెంట్లు, హోటళ్లకు సప్లై చేస్తున్నారు. కొనుగోలు చేయడానికి వచ్చిన వాళ్లు చూస్తే… మాంసం ఫ్రెష్గా, మెత్తగా కనిపించేలా కెమికల్స్ కలుపుతున్నారు. మాంసం నుంచి ఎర్రగా కారుతుంది రక్తం అని భ్రమ పడేలా కనిపిస్తుంది. కానీ అది రక్తం కాదు. హానికర రసాయనాలు. చిన్నాచితకా వ్యాపారులు కూడా వాటిని ఫ్రెష్ మాంసం అనుకుని కొనుగోలు చేస్తున్నారు. అఫ్రోజ్ నిర్వహిస్తున్న గోదాం నుంచి సిటీలో ఏయే షాపులకు, హోటళ్లకు, రెస్టారెంట్లకు మాంసం సరఫరా అవుతుందనే వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. వ్యాపారులు కూడా ఇది కుళ్లిన మాంసం అని తెలిసే కొనుగోలు చేస్తున్నారా.. ? అని ఆరా తీస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు అధికారులు. గోదాంను సీజ్ చేసి… మాంసాన్ని కాల్చివేశారు అధికారులు. ఒక్క గోదాంలోనే 14 వేల కిలోల మాంసం లభ్యమైందంటే.. నిత్యం ఎన్ని హోటళ్లకు ఈ ప్రమాదకర మాంసం సప్లై అవుతోందో అర్థం చేసుకోవచ్చు. ప్రజలు బయట ఫుడ్ తినేటప్పుడు… ముఖ్యంగా నాన్ వెజ్ తినేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు.
