Cyberabad Police: హైదరాబాద్లో గురువారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. వాతావరణ శాఖ హెచ్చరికలను పరిగణనలోకి తీసుకుని, ఐటీ కారిడార్ పరిధిలోని అన్ని ఐటీ కంపెనీలు, ఇతర సంస్థలకు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయం కీలకమైన ట్రాఫిక్ అడ్వైజరీని జారీ చేసింది. భారీ వర్షాల వల్ల రోడ్లపై తీవ్ర ట్రాఫిక్ స్తంభించిపోకుండా నివారించడమే కాకుండా, ఉద్యోగుల భద్రతను, అత్యవసర సేవల రాకపోకలను పునరుద్ధరించడం ప్రధాన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సాధ్యమైనంత వరకు ఐటీ కంపెనీలన్నీ తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) సౌకర్యాన్ని కల్పించాలని, కార్యాలయాలకు వచ్చిన వారిని మధ్యాహ్నం 2:00 గంటల నుంచి దఫదఫాలుగా (staggered manner) ముందస్తుగా లాగ్ అవుట్ (Early Logout) చేయాలని పోలీసులు సూచించారు.
ఉద్యోగులందరూ ఒకేసారి రోడ్లపైకి వస్తే ఐటీ కారిడార్లోని ప్రధాన రహదారులపై విపరీతమైన ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే, ముందస్తు ప్రణాళికతో దఫదఫాలుగా లీవ్ చేయడం వల్ల రోడ్లపై ట్రాఫిక్ తగ్గి, రాకపోకలు సులభతరం అవుతాయని స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఐటీ కంపెనీలు తమ ముందస్తు లాగ్ అవుట్ సమయాలు, ఆఫీసుల లోకేషన్ వివరాలను సరిగ్గా నిర్వహించడానికి `Jt.CP.traffic.cyberabad@gmail.com` కు ఈమెయిల్ ద్వారా తెలియజేయాలని పోలీసులు కోరారు. దీనివల్ల ట్రాఫిక్ పోలీసులు రహదారులపై తగినంత సిబ్బందిని నియమించి, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సమర్థవంతంగా నిర్వహణ చేపట్టడానికి వీలవుతుందని సూచించారు. వర్షం తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు, ఐటీ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని, పోలీసుల సూచనలను పాటించి సహకరించాలని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఓ ప్రకటనలో తెలిపారు.
Revised order stating the Work from Home (WFH) and Early logouts in staggered manner on 30.07.2026 from 2pm onwards.. pic.twitter.com/TyBkw4g5Qh
— Cyberabad Traffic Police (@CYBTRAFFIC) July 30, 2026

