Hyderabad Drugs: డ్రగ్స్ కేసును ఛేదించేందుకు వెళ్లిన పోలీసులపై ఓ యువకుడు కారుతో దాడికి పాల్పడిన ఘటన హైదరాబాద్లో కలకలం రేపింది. డ్రగ్స్ కొనుగోలు జరుగుతోందన్న సమాచారంతో నిఘా పెట్టిన హెచ్-న్యూ (Hyderabad Narcotics Enforcement Wing) పోలీసులపై నిందితుడు కారును దూసుకెళ్లడంతో ఓ కానిస్టేబుల్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో మరో కానిస్టేబుల్, ఓ సీఐ కూడా గాయపడగా.. నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. హెచ్-న్యూ కానిస్టేబుల్ మహేందర్ యాదవ్కు అబిడ్స్లో డ్రగ్స్ కొనుగోలు జరుగుతోందన్న సమాచారం అందింది. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చిన ఆయన.. హెచ్-న్యూ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్తో పాటు ప్రత్యేక బృందంతో కలిసి అబిడ్స్ ప్రాంతంలో నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బ్లూ కలర్ బెలెనో కారు అబిడ్స్లోని పాయల్ ఫుట్వేర్ సమీపానికి చేరుకోగా.. ఓ వ్యక్తి కారులో ఉన్న వ్యక్తికి అనుమానాస్పద ప్యాకెట్ అందజేశాడు. వెంటనే అక్కడే ఉన్న పోలీసులు ప్యాకెట్ ఇచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
కారులో ఉన్న హుస్సేనీ ఆలం ప్రాంతానికి చెందిన సైఫ్కు పోలీసులు తమ ఐడీ కార్డులు చూపించి వాహనం నుంచి దిగాలని సూచించారు. అయితే కారు పక్కకు ఆపుతున్నట్లు నటించిన సైఫ్ ఒక్కసారిగా వాహనాన్ని రివర్స్లో వేగంగా నడిపాడు. ఈ సమయంలో అడ్డుకునేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ కాలిపై నుంచి కారు వెళ్లడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.
నిందితుడిని వెంబడించిన ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ బృందం అఫ్జల్గంజ్ వద్ద కారును అడ్డుకుని సైఫ్ను అదుపులోకి తీసుకుంది. ఈ క్రమంలో ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, కానిస్టేబుల్ వంశీధర్ లకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. కాలిపై నుంచి కారు వెళ్లడంతో కానిస్టేబుల్ మహేందర్ యాదవ్కు కాలు ఫ్రాక్చర్ కావడంతో వెంటనే ఆయనను సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మహేందర్ యాదవ్ ఫిర్యాదు మేరకు.. నిందితుడు సైఫ్పై అబిడ్స్, అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లలో హత్యాయత్నం (Attempt to Murder) సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం సైఫ్ను హెచ్-న్యూ పోలీసులు అదుపులోకి తీసుకుని డ్రగ్స్ వ్యవహారంపై, ఘటనకు సంబంధించిన ఇతర కోణాలపై విచారణ కొనసాగిస్తున్నారు.

