Site icon NTV Telugu

Minister Komati Reddy: డబుల్ డెక్కర్ కారిడార్‌గా హయత్‌నగర్-L.B నగర్ రూట్.. మంత్రి కోమటి రెడ్డి..

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఎప్పుడూ రద్దీగా ఉండే ఎల్బీనగర్, హయత్ నగర్ ప్రాంతాల రూపురేఖలు మార్చేలా రాష్ట్ర ప్రభుత్వం భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని.. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రహదారుల విస్తరణ, అత్యాధునిక రవాణా వ్యవస్థల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో హయత్ నగర్ పరిధిలో జరిగిన అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమ విశేషాలు , మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించిన కీలక అంశాలు ఇలా ఉన్నాయి. రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శనివారం హయత్ నగర్ ప్రాంతంలో పర్యటించారు. తొర్రూర్ ఎక్స్ రోడ్ (సాయిబాబా ఆలయం) నుంచి జీ స్కూల్ వరకు ఉన్న రహదారిని ప్రస్తుతం ఉన్న 2-లేన్ల నుంచి 4-లేన్ల రహదారిగా విస్తరించే పనులకు ఆయన భూమి పూజ చేశారు. సుమారు 10 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు వల్ల స్థానిక వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఈ కార్యక్రమంలో రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అబ్బురపరిచే ‘డబుల్ డెక్కర్’ కారిడార్
హైదరాబాద్ రవాణా ముఖచిత్రంలోనే ఒక మైలురాయిగా నిలిచే డబుల్ డెక్కర్ కారిడార్ నిర్మాణాన్ని మంత్రి ప్రకటించారు. ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ రేడియో స్టేషన్ వరకు (6 కిలోమీటర్లు) దీనిని నిర్మించనున్నారు. ఇది మూడు అంచెలుగా ఉంటుంది. అత్యంత ఎగువన మెట్రో రైలు ప్రయాణిస్తుంది. మధ్య భాగంలో నేషనల్ హైవే గ్రిడ్ ఉంటుంది. కింది భాగంలో స్థానిక వాహనాల రాకపోకల కోసం వెహికిల్ అండర్ పాస్ (VUP) లు నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం 940 కోట్ల రూపాయలు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇప్పటికే 200 కోట్ల రూపాయలను కేటాయించిందని మంత్రి వివరించారు.

Also Read:Ira Bhaskar: ధురంధర్ ‘‘హిందుత్వ’’ సినిమా.. పాక్‌పై స్వర భాస్కర్ తల్లి ప్రేమ..

హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్లు.. నెక్స్ట్ లెవల్ కనెక్టివిటీ..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో హైదరాబాద్ నగరం గ్లోబల్ సిటీగా ఎదుగుతోందని మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్తు ప్రణాళికల్లో భాగంగా ఈ ప్రాంతం మీదుగానే మూడు ప్రధాన హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్లు హైదరాబాద్ – చెన్నై, హైదరాబాద్ – బెంగళూరు, హైదరాబాద్ – ముంబై (పూణే మీదుగా) రానున్నాయని వెల్లడించారు.

ఈ భారీ ప్రాజెక్టుల వల్ల హయత్ నగర్, ఇబ్రహీంపట్నం వంటి ప్రాంతాలు భవిష్యత్తులో ఐటీ హబ్ అయిన కోకాపేట తరహాలో అత్యంత విలువైన, డిమాండ్ ఉన్న ప్రాంతాలుగా మారుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ – విజయవాడ మార్గంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు 10-లేన్ల రహదారి పనులను కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఈ అభివృద్ధి పనులన్నీ పూర్తయితే.. భాగ్యనగరం ఈస్ట్ ప్రాంతం అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులతో సరికొత్త కళను సంతరించుకోనుంది.

Exit mobile version