Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్‌ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!

Hyderabad

Hyderabad

Hyderabad: హైదరాబాద్‌ సంతోష్‌నగర్ డివిజన్ పరిధిలోని ఐఎస్‌సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఏటీఎం రీఫిలింగ్ వ్యాన్ చోరీ కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. కన్న కొడుకులతో కలిసే డ్రైవర్ శ్రీనివాస్ ఈ పెద్ద స్కెచ్ వేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. జగిత్యాలకు చెందిన శ్రీనివాస్ కొన్ని నెలల క్రితమే ‘క్లియర్డ్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థలో డ్రైవర్‌గా చేరాడు. కంపెనీ నిబంధనల ప్రకారం రూ. 30 లక్షల నగదుతో ఏటీఎంలలో రీఫిలింగ్ చేయడానికి డ్రైవర్ శ్రీనివాస్‌తో పాటు క్యాష్ కస్టోడియన్లు సురేష్, పాపయ్య, గన్మెన్ నబీ సాబ్‌లు వ్యాన్‌లో బయలుదేరారు. నగరం మొత్తంలో ఆరు ప్రాంతాల్లో ఏటీఎంలను విజయవంతంగా రీఫిలింగ్ చేసిన తర్వాత, ఈ వ్యాన్ ఈది బజార్ లోని ఎస్బీఐ (SBI) ఏటీఎం వద్దకు చేరుకుంది.

అదును చూసి అపహరణ..

ఏటీఎంలో నగదు రీఫిలింగ్ చేయడానికి కస్టోడియన్లు సురేష్, పాపయ్యతో పాటు గన్మెన్ నబీ సాబ్ ముగ్గురూ లోపలికి వెళ్లారు. ఆ సమయంలో వ్యాన్ వద్ద ఒంటరిగా ఉన్న డ్రైవర్ శ్రీనివాస్ ఇదే సరైన అదునుగా భావించాడు. వ్యాన్‌లో రూ. 7 లక్షలతో ఒక బ్యాగ్, రూ. 17 లక్షలతో మరో బ్యాగ్ ఉన్నాయి. అయితే శ్రీనివాస్ అప్పటికే తన పెద్ద కుమారుడితో కలిసి ఒక ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. శ్రీనివాస్ కొడుకు టూ వీలర్‌పై ఈ వ్యాన్‌ను మొదటి నుంచి ఫాలో అవుతున్నాడు. అవకాశం చిక్కగానే వ్యాన్ లోని రూ. 17 లక్షల నగదు బ్యాగును తీసుకుని, బయట సిద్ధంగా ఉన్న కొడుకు బైక్‌పై శ్రీనివాస్ క్షణాల్లో పరారయ్యాడు.

కస్టోడియన్లు, గన్మెన్ ఏటీఎం నుంచి బయటకు వచ్చేసరికి వ్యాన్ వద్ద శ్రీనివాస్ కనిపించకపోవడం, రూ.17 లక్షల క్యాష్ బ్యాగ్ మాయమవ్వడంతో వారు షాక్‌కు గురయ్యారు. వెంటనే కస్టోడియన్ సురేష్ ఐఎస్‌సదన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకునేందుకు తక్షణమే ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ (CCTV) కెమెరా ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులకు అసలు విషయం అర్థమైంది. బైక్‌పై వచ్చింది మరెవరో కాదు, డ్రైవర్ శ్రీనివాస్ కన్న కొడుకేనని పోలీసులు నిర్ధారించారు. బైక్‌పై శ్రీనివాస్, అతని పెద్ద కుమారుడు ఇద్దరూ కలిసి ఉప్పుగూడ వరకు వెళ్లారు. అక్కడికి తన చిన్న కుమారుడిని కూడా పిలిపించుకున్న శ్రీనివాస్, దొంగిలించిన సొమ్ములో నుంచి కొంత నగదును అతనికి ఇచ్చి పంపించేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి శ్రీనివాస్, అతని పెద్ద కుమారుడు ఒక క్యాబ్‌ను మాట్లాడుకుని శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR) వైపు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఆధారాల సహాయంతో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశారు.