హువావే సంస్థ భారత మార్కెట్లోకి తన సరికొత్త ‘మేట్ప్యాడ్ 11.5 (2026)’ టాబ్లెట్ను అధికారికంగా విడుదల చేసింది. ఉత్పాదకత, నోట్ టేకింగ్ , ఎంటర్ టైన్మెంట్ లక్ష్యంగా డిజైన్ చేసిన ఈ మిడ్-రేంజ్ టాబ్లెట్ ఆగస్టు 7 నుండి ఫ్లిప్కార్ట్లో అందుబాటులోకి రానుంది. భారత మార్కెట్లో దీని ధర రూ.43,999గా నిర్ణయించారు. ఇది స్పేస్ గ్రే, వయోలెట్ రంగుల్లో లభిస్తుంది.
ఈ టాబ్లెట్లో 11.5-అంగుళాల 2.5K టీఎఫ్టీ ఎల్సీడీ డిస్ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ బ్రైట్నెస్కు సపోర్ట్ చేస్తుంది. కంటికి ఒత్తిడి తగ్గించేందుకు, పేపర్ వంటి అనుభూతినిచ్చేందుకు ఇందులో ప్రత్యేకమైన యాంటీ-రిఫ్లెక్షన్ కోటింగ్ ఉపయోగించారు. ఆల్-మెటల్ యూనిబాడీ డిజైన్తో కూడిన ఈ టాబ్లెట్ 6.1 mm మందం, 515 గ్రాముల బరువుతో చాలా సన్నగా, తేలికగా ఉంటుంది.
ఇది ఆక్టా-కోర్ కిరిన్ T82B చిప్సెట్తో పనిచేస్తుంది. వేడి తగ్గించడానికి ప్రత్యేకమైన కూలింగ్ సిస్టమ్ను ఇందులో అందించారు. ఈ టాబ్లెట్ 8GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యంతో వస్తుంది. 10,100 mAh భారీ బ్యాటరీ కలిగిన ఈ పరికరం వరుసగా 14 గంటల వీడియో ప్లేబ్యాక్ను అందిస్తుంది. దీనికి 40W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
ఫొటోగ్రఫీ కోసం వెనుక వైపు 13MP కెమెరా, ముందు వైపు 8MP సెల్ఫీ కెమెరా అందించారు. అద్భుతమైన సౌండ్ కోసం నాలుగు స్పీకర్ల సిస్టమ్ను అమర్చారు. హార్మొనీ ఓఎస్ 4.3పై పనిచేసే ఈ టాబ్లెట్లో ల్యాప్టాప్ తరహా అనుభూతి కోసం ‘పిసి-లెవెల్ WPS ఆఫీస్’ ముందుగానే ఇన్స్టాల్ అయి వస్తుంది. ఫైల్స్ సులభంగా షేర్ చేయడానికి ‘సూపర్హబ్’ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

