NTV Telugu Site icon

POCSO Act : ఆ రోజు హోటల్‌లో డిన్నర్‌కు తీసుకెళ్లి గదిలో బలవంతంగా

Rape

Rape

రోజు రోజకు ఆడపిల్లలపై ఆఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. తమ స్థాయిని మరిచి చిన్నా పెద్దా తేడా లేకుండా తమ కామకోరికలను తీర్చుకునేందుకు ప్రేమ, పెళ్లి పేర్లను అడ్డుపెట్టుకుంటున్నారు. తీరా కావాల్సిన కోరిక తీరాక ముఖం చాటేస్తున్నారు. అలాంటి ఘటనే ఇది. 22 ఏళ్ల బాధితురాలి ఫిర్యాదుతో కర్ణాటక పోలీసులు హాకీ ప్లేయర్ వరుణ్ కుమార్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బెంగళూరు నగరంలోని జ్ఞానభారతి పోలీసులు వరుణ్‌ కుమార్‌పై లైంగిక నేరాల నిరోధక చట్టంలోని సెక్షన్ 4 (2), 5 (ఎల్), 6, మైనర్‌పై అత్యాచారం చేసినందుకు ఐపిసి సెక్షన్ 376 (3) నిబంధనల ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పెళ్లి చేసుకుంటానని 16 ఏళ్ల వయసు నుంచి నిందితుడు తనపై అత్యాచారం చేసి లైంగికంగా వేధించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. “ఒక సంవత్సరం క్రితం, మా నాన్న చనిపోయిన తర్వాత, నిందితుడు నన్ను పరామర్శించడానికి వచ్చాడు, తరువాత నాకు కాల్ చేయడం మానేశాడు, నా కాల్‌లను రెస్పాండ్‌ కావడం లేదు. నేను పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నప్పుడు, అతను మళ్లీ నాతో మాట్లాడటం ప్రారంభించాడు. నేను అతనిని వివాహం చేసుకోవాలని అడిగినప్పుడు, మాటదాటేస్తూ వచ్చాడు. నేను పెళ్లికి పట్టుబట్టి ఇబ్బంది పెడితే తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని నిందితుడు బెదిరించాడు’ అని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.

అయితే.. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన బాధితురాలు వాలీబాల్‌లో ట్రైనీగా ఎంపికైన తర్వాత బెంగళూరులోని జ్ఞానభారతిలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కోచింగ్ సెంటర్‌లో శిక్షణ పొందుతోంది. 16 సంవత్సరాల వయస్సులో ఆమె మహిళా హాస్టల్‌లో ఉంటోంది. నిందితుడు ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమై మెసేజ్ చేస్తున్నాడు. ఆ సమయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్‌ కుమార్‌ అదే క్యాంపస్‌లోని జాతీయ శిబిరంలో శిక్షణ పొందుతున్నాడు. “నేను అతని సందేశాలకు నేను స్పందించలేదు. నిందితుడు తన స్నేహితులను నా దగ్గరకు పంపాడు, అప్పటికీ నేను స్పందించలేదు. నిందితుడు నాకు తరచూ మెసేజ్‌లు పంపుతున్నాడని, నేను లేకుండా తాను బ్రతకనని.. అతని స్నేహితులు నన్ను వారి సోదరిలా కాపాడతారని నాకు హామీ ఇచ్చినప్పుడు. చివరగా, నేను అతనిని కలవడానికి అంగీకరించాను. మీటింగ్‌లో నిందితుడు నన్ను పెళ్లి చేసుకోమని బలవంతం చేశాడు, నేను ఆఫర్‌ను తిరస్కరించాను. మా పెళ్లికి నా కుటుంబసభ్యులు ఒప్పుకునేలా చేస్తానని, అప్పటి వరకు స్నేహితులుగా ఉందామని నిందితుడు చెప్పాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.

“ఈ నేపథ్యంలోనే అతను నన్ను జయనగర్ ఫోర్త్ బ్లాక్‌లోని ఒక హోటల్‌కి డిన్నర్‌కి తీసుకెళ్లాడు. డిన్నర్ అయ్యాక నన్ను బలవంతంగా గదిలోకి తీసుకెళ్ళాడు. నేను మైనర్‌నని, పెళ్లికి ముందు ఇలాంటివి వద్దంటున్న వినిపించుకోకుండా అతడు బలవంతంగా లైంగికంగా లోబర్చుకున్నాడు. ఐదేళ్లుగా పెళ్లి వాగ్దానాలను నమ్మిన తర్వాత నేను అతనిని ప్రేమించాను. కొన్నాళ్లుగా బెంగళూరులోని పలు హోటళ్లకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు’’ అని ఆమె ఆరోపించింది. బాధితురాలి వాంగ్మూలాలను పరిశీలించి నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.