కేరళలోని కాలికట్ విమానాశ్రయంలో ఎయిర్ అరేబియా విమానానికి బూటకపు బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపింది. జూన్ 22, శనివారం ఉదయం కాలికట్ విమానాశ్రయం నుంచి షార్జాకు బయలుదేరిన ఎయిర్ అరేబియా విమానానికి బాంబు బెదిరింపుతో బాంబు డిటెక్షన్ స్క్వాడ్ తనిఖీలు చేసింది. విమానం టేకాప్ కాకుండా ఎయిర్పోర్టులో నిలిపివేశారు. షార్జా నుంచి కాలికట్కి విమానంలో వచ్చిన ప్రయాణీకుల్లో ఒకరు.. సీట్లలో ఒక దానిపై బాంబు అని నోట్ ఉంచారు. దీన్ని గమనించిన స్టాప్.. భద్రతా సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో తనిఖీలు చేపట్టగా.. నకిలీదిగా తేల్చారు. బాంబు డిటెక్షన్ స్క్వాడ్ విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిందని అధికారి తెలిపారు.
ఇది కూడా చదవండి: NEET Paper Leak: నీట్ పేపర్ లీక్ కేసులో సూత్రధారి అరెస్ట్.. ఎవరు ఈ “రవి అత్రి”..
శనివారం ఉదయం కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి షార్జాకు బయలుదేరాల్సిన ఎయిర్ అరేబియా విమానానికి సంబంధించి బూటకపు బాంబు బెదిరింపు వచ్చిందని.. దీంతో బాంబు డిటెక్షన్ స్క్వాడ్, పోలీసుల తనిఖీలు నిర్వహించినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. తనిఖీలు పూర్తయ్యాయని.. ఫ్లైట్ టేకాఫ్ కోసం క్లియర్ కావడానికి.. బాంబు డిటెక్షన్ స్క్వాడ్ నుంచి నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు అధికారి ఉదయం 11 గంటలకు చెప్పారు. ఉదయం 8.30 గంటలకు బయలుదేరాల్సిన విమానం ఇప్పుడు సాయంత్రం 5 గంటలకు బయలుదేరుతుందని ఆయన చెప్పారు. అలాగే ప్రయాణికులకు విమానాశ్రయంలో వసతి కల్పించామని.. ఆహారం, నీరు అందించినట్లు వెల్లడించారు. కాగా విమానంలో నోట్ను పెట్టిన ప్రయాణికుడిని ఇంకా గుర్తించలేదని, బూటకపు బెదిరింపు వెనుక ఎవరున్నారనే దానిపై ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు. తదనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామని కరిపూర్ పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు.
ఇది కూడా చదవండి: Citroen C3 Aircross Plus: ఈ కారుపై భారీ తగ్గింపు.. త్వర పడండి