Vizag: విశాఖ రైలు ప్రమాదంపై విచారణను వేగవంతం చేశారు. అగ్నిప్రమాదంలో దగ్ధమైన బోగీలను సాంకేతిక బృందాలు పరిశీలించాయి. ఆర్.డీ.ఎస్.ఓ, ఐ.సీ.ఎఫ్ బృందాలు సమగ్రంగా విచారణ జరుపుతున్నాయి. క్లూ్స్ టీమ్ కూడా ఆధారాల సేకరణలో నిమగ్నమైంది. ప్రమాదానికి గురైన మూడు కోచ్లను పరిశీలించేందుకు ఈస్ట్ జోన్ రైల్వే అధికారులు, ఆర్.డీ.ఎస్.ఓ, ఐ.సీ.ఎఫ్ బృందాలు మెయింటెనెన్స్ డిపోకు వెళ్లాయి. బ్యాటరీ సిస్టమ్పై లోతైన దర్యాప్తు చేయాల్సి ఉన్నట్టు అధికారుల బృందం అభిప్రాయపడింది. అగ్ని ప్రమాదంపై విచారణ కొనసాగుతోంది. ఇటీవల విశాఖ రైల్వేస్టేషన్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కోర్బా నుంచి విశాఖ చేరుకున్న ఎక్స్ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బీ6, బీ7, ఎం1 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
Read Also: Chandrababu: రాజధాని పరిధిలో ఇచ్చిన ఇళ్ల స్థలాలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
విశాఖపట్నంలో ఆగస్ట్ 4న ఖాళీగా ఉన్న ఏసీ కోచ్లో జరిగిన అగ్ని ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ సూరత్ జానీ, చీఫ్ రోలింగ్ స్టాక్ ఇంజనీర్ ఎస్సీ బెహెరా, చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ బీఎస్ నాథ్లతో కూడిన ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఈస్ట్ కోస్ట్ రైల్వే ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 4వ తేదీ రాత్రి విశాఖపట్నం చేరుకుంది. వారు ఈరోజు స్టేషన్ యార్డ్, మెయింటెనెన్స్ డిపోలోని కోచ్ను పరిశీలించి విచారణ ప్రారంభించారు. రైల్వే అధికారులు, సిబ్బంది, స్టేషన్ సిబ్బందితో మాట్లాడారు.కోచ్ను తయారు చేసిన చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్) నుంచి ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, RDSO లక్నో నుంచి ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా వివరణాత్మక సాంకేతిక విశ్లేషణ కోసం విశాఖపట్నం చేరుకున్నారు. రాష్ట్ర ఫోరెన్సిక్ బృందం కూడా ఆగస్టు 4న కోచ్ని తనిఖీ చేయడం ద్వారా దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తు పురోగతిలో ఉంది.