రకుల్‌ప్రీత్‌సింగ్ సినిమా టైటిల్ మారిపోయింది

బాలీవుడ్‌లో అజయ్ దేవగణ్ సినిమాలకు ప్రత్యేకంగా క్రేజ్ ఉంటుంది. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం ‘మేడే’. ఈ మూవీలో అజయ్ దేవగణ్ సరసన టాలీవుడ్ బ్యూటీ రకుల్‌ప్రీత్‌సింగ్ నటిస్తోంది. అయితే ‘మేడే’ మూవీ టైటిల్ ఇప్పుడు మారిపోయింది. తమ సినిమా పేరును ‘రన్‌వే 34’గా మారుస్తున్నట్లు హీరో అజయ్‌దేవగణ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. టైటిల్ మార్పుకు కారణాలను అతడు చెప్పలేదు. ఈ చిత్రంలో బిగ్‌బీ అమితాబ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీ థ్రిల్లర్‌ అంశాలతో తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 29న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

Read Also: 20 ఏళ్ళ శ్రియ నటపర్వం

కాగా అజయ్ దేవగణ్‌తో రకుల్ ప్రీత్‌సింగ్ నటిస్తున్న రెండో సినిమా ఇది. 2019లో వచ్చిన ‘దే దే ప్యార్‌ దే’ మూవీలో తొలిసారిగా వీరి జంట కనువిందు చేసింది. అయితే అమితాబ్‌తో కలిసి నటించడం రకుల్‌కు ఇదే తొలిసారి. అమితాబ్, రకుల్ ఈ మూవీలో పైలట్లుగా కనిపించనున్నారు. ఈ సినిమాకు మరో విశేషం కూడా ఉంది. హీరో అజయ్ దేవగణ్ స్వయంగా ఈ మూవీకి దర్శకత్వం కూడా చేస్తున్నాడు. 2016లో వచ్చిన షివాయ్ మూవీ తర్వాత అజయ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇదే కావడం గమనార్హం.