NTV Telugu Site icon

AP Disaster Management Authority: ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్..

Ap Disaster Management

Ap Disaster Management

AP Disaster Management Authority: ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలో ఇప్పటికే వర్షాలు దంచికొడుతున్నాయి.. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడంతో.. ఏజెన్సీలోని పలు గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి.. అయితే, ఈ రోజు, రేపు కూడా పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ.. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. 2-3 రోజుల్లో మరింత బలపడి ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో రేపు ప్రకాశం జిల్లా, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.. ఇక, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. ఇక, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది..

Read ALso: Aadujeevitham OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న బ్లాక్ బస్టర్ మూవీ ‘ఆడు జీవితం’!

అలాగే విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ.. ఇక, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.. ఈ సమయంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.. ప్రజలు వరద ప్రవహించే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని సూచించింది.. ఇక, వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉంది.. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు కింద ఉండరాదు అని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్ ఇచ్చింది.