Hyderabad Womens Coach: హైదరాబాద్ మహిళా క్రికెటర్ల పట్ల అసభ్య ప్రవర్తన.. కోచ్ జై సింహాను సస్పెండ్ చేసిన హెచ్‌సీఏ!

Hca

Hca

HCA suspends Hyderabad Women Coach Jai Simha: హైదరాబాద్ మహిళా క్రికెటర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కోచ్ జై సింహాపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. కోచ్ పదవి నుంచి తక్షణమే తప్పుకోవాలని హెచ్‌సీఏ ఆదేశించింది. జై సింహాను సస్పెండ్‌ చేస్తూ హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌ రావు ఆదేశాలు జారీ చేశారు. మహిళా క్రికెటర్ల రక్షణకు భంగం కలిగితే ఉపేక్షించేది లేదని, క్రిమినల్ కేసులు పెడతాం అని తెలిపారు.

‘గత కొంతకాలంగా మహిళా క్రికెట్ కోచ్ జై సింహాపై ఫిర్యాదులు వస్తున్నాయి. జై సింహాను సస్పెండ్ చేస్తున్నాం. మహిళలపై వేధింపులకు పాల్పడితే జీవిత కాలం నిషేధం విధిస్తాం. జై సింహాపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాము. హెచ్‌సీఏకు సంబంధించిన కార్యక్రమాల్లో జై సింహా పాల్గొనకూడదు. ఇలాంటి చర్యలకు పాల్పడితే లైఫ్ టైం బ్యాన్ చేస్తాం. మహిళా క్రికెటర్లకు హెచ్‌సీఏ అండగా ఉంటుంది. పూర్తి స్థాయి విచారణ జరుపుతాం’ అని హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌ రావు అన్నారు.

కోచ్ జై సింహాపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌కు మహిళా క్రికెటర్ల తల్లిదండ్రులు జనవరిలో లేఖ రాశారు. జై సింహాకు పలువరు అండగా ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. జై సింహా తాగుడుకు బానిస అయ్యాడు. తమ ముందు మద్యం తాగొద్ధని పలుమార్లు మహిళా ప్లేయర్స్ వారించినా వినలేదు. తనను ప్రశ్నిస్తే టీంలో నుండి తీసేస్తామని బెదిరింపులు గురిచేవాడు. బీసీసీఐకి కూడా మహిళా క్రికెట్ ప్లేయర్స్ పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన నెల రోజుల తరువాత హెచ్‌సీఏ స్పందించింది.

Also Read: IIT Delhi: హాస్టల్ గదిలో ఉరేసుకున్న ఎంటెక్‌ విద్యార్థి!

విజయవాడలో మ్యాచ్‌ ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న సమయంలో కోచ్ జై సింహా మహిళా క్రికెటర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బస్సులో వారి ముందే మద్యం సేవిస్తూ.. అడ్డు చెప్పినందుకు బూతులు తిట్టాడు. దాంతో మహిళా క్రికెటర్లు కోచ్‌ వ్యవహార శైలిపై హెచ్‌సీఏకు నాలుగు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. జై సింహాతో పాటు సెలక్షన్‌ కమిటీ మెంబర్‌ పూర్ణిమ రావుపై కూడా కంప్లైంట్‌ చేశారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి రావడంతో హెచ్‌సీఏ చర్యలకు ఉపక్రమించింది.