Hamirpur: కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన.. ఆరుగురు మృతి.!

Hamirpur

Hamirpur

Hamirpur Bridge Collapse: ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బేత్వా నదిపై మొరాకందర్, కందౌర్ గ్రామాల మధ్య నిర్మిస్తున్న ఈ వంతెన శుక్రవారం తెల్లవారుజామున కూలిపోవడంతో ఆరుగురు కార్మికులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకుపోయి ఉండవచ్చని భావిస్తున్న నేపథ్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

అధికారుల సమాచారం ప్రకారం.. గురువారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షం, ఈదురుగాలులు వీచాయి. ఈ సమయంలో వంతెనలోని ఒక భాగంపై నిద్రిస్తున్న కార్మికులపై నిర్మాణ భాగం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో అక్కడే పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, SDRF బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి.

×
×
Ad

హమీర్‌పూర్ అదనపు ఎస్పీ అర్వింద్ కుమార్ వర్మ మాట్లాడుతూ.. రాత్రి సుమారు 2 గంటల సమయంలో వంతెన స్లాబ్ కూలిపోయిందని సమాచారం అందిందన్నారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టామని తెలిపారు. ఇప్పటివరకు ఐదుగురు మృతదేహాలను వెలికితీసి గుర్తించినట్లు చెప్పారు. ఇంకా శిథిలాల కింద కార్మికులు చిక్కుకుని ఉండే అవకాశం ఉందని వెల్లడించారు.

ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలకు తగిన పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లా యంత్రాంగం, SDRF సమన్వయంతో సహాయక చర్యలను వేగవంతం చేయాలని సూచించారు.