Guntur: మద్యం వ్యసనానికి బానిసవడమే కాకుండా ఆస్థి తన పేరుపై రాయాలని వేధిస్తున్న ఘటన గుంటూరు జిల్లాలో కలకలం సృష్టించింది. తెనాలి నాజరుపేటలో నివాసం ఉంటున్న భాస్కరరావు, విజయమ్మలకు ఇద్దరు కొడుకులు సంతానం. పెద్ద కొడుకు కోటేశ్వరరావు మద్యానికి బానిసయ్యాడు. దీంతో భార్యకూడా వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. కొల్లిపరలో ఉన్న రెండు సెంట్ల భూమిని తనపేరున రాయాలంటూ తల్లిదండ్రులను వేధిస్తున్నాడు. రాత్రి మద్యం తాగి ఇంటికొచ్చిన కోటేశ్వరరావు తల్లిదండ్రులతో గొడవపడ్డాడు.
ఈ సమయంలో కొడుకు వేధింపులు భరించలేని భాస్కరరావు కత్తితో కోటేశ్వరరావు పీక కొయ్యడంతో మృతి చెందాడు. ఇంట్లో పెద్ద శబ్దాలు రావడం గమనించిన స్థానికులు ఏం జరిగిందని అడగడంతో విషయం బయటకొచ్చింది. కొడుకు మృతదేహాన్ని ఆటోలో తరలించేందుకు ప్రయత్నించడం గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కోటేశ్వరరావు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.

