బంగారం కోసం ఓ మహిళ చెవులను కోసేసి.. ఆపై దారుణ హత్య చేశారు. అంతే కాకుండా.. ఆమె శవాన్ని తోటలో పాతి పెట్టారు. గుజరాత్ రాష్ట్రంలోని మెహసానా జిల్లా ఇంద్రద్ గ్రామంలో ఒక దారుణమైన హత్య వెలుగులోకి వచ్చింది. 54 ఏళ్ల శారదాబెన్ థాకూర్ అనే మహిళ అదృశ్యం కావడం, ఆపై ఆమె శవమై కనిపించడం స్థానికంగా పెను కలకలం రేపింది. ఈ కేసులో పోలీసులు కేవలం 10 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు.
అసలేం జరిగింది?
మార్చి 20వ తేదీన శారదాబెన్ ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించగా ఫలితం లేకపోయింది. చివరకు సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా, ఆమె ‘సవితా అమృత్ ఫామ్’ అనే తోటలోకి వెళ్లినట్లు కనిపించింది. కానీ.. ఆమె తిరిగి బయటకు వచ్చిన దృశ్యాలు ఎక్కడా లేవు. అనుమానంతో పోలీసులు ఆ తోటను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అక్కడ ఒక నిమ్మ చెట్టు కింద మట్టిని కొత్తగా తవ్వినట్లు గుర్తించారు. ఆ మట్టిపై ఈగలు ముసురుతుండటంతో అనుమానం వచ్చి తవ్వగా.. శారదాబెన్ మృతదేహం బయటపడింది.
నిందితుడు సచిన్ కుమార్ దంతాని, శారదాబెన్ను దారుణంగా హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న నగలను దోచుకున్నాడు. కేవలం బంగారం కోసం ఆమె చెవులను కూడా కోసేసి, సుమారు రూ. 4.40 లక్షల విలువైన ఆభరణాలతో పరారయ్యాడు. మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా తోటలోనే పాతిపెట్టాడు.
నిందితుడు కిలో వెండి పట్టీలను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నాడన్న పక్కా సమాచారంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తనపై ఉన్న అప్పుల భారం వల్లే ఈ హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. పోలీసులు నిందితుడి నుంచి హత్యకు వాడిన ఆయుధాన్ని, రూ. 3.40 లక్షల విలువైన నగలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల కస్టడీలో ఉన్నాడు.
