మాతృత్వం అనేది ప్రతి మహిళ జీవితంలో ఒక మధుర స్వప్నం. కానీ, ప్రకృతి సిద్ధంగా గర్భాశయం లేకుండా జన్మించిన వారికి ఆ కల అందని ద్రాక్షే. అయితే, ఆధునిక వైద్య శాస్త్రం అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. మరణించిన దాత నుంచి సేకరించిన గర్భాశయాన్ని విజయవంతంగా అమర్చుకుని, ఒక మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. బ్రిటన్ వైద్య చరిత్రలో తొలిసారిగా జరిగిన ఈ అద్భుత ఘట్టం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Also Read : Janhvi Kapoor :నీ గొంతు, నీ స్పర్శే నా బలం.. శ్రీదేవి వర్ధంతి వేళ జాన్వీ ఎమోషనల్ పోస్ట్ వైరల్!
వివరాలోకి వెళ్ళితే.. యూకేకు చెందిన గ్రేస్ బెల్ అనే మహిళ గర్భాశయం లేకుండా జన్మించింది (దీనిని వైద్య పరిభాషలో MRKH సిండ్రోమ్ అంటారు). దీనివల్ల ఆమెకు పీరియడ్స్ వచ్చే అవకాశం లేదు, కానీ ఆమె అండాశయాలు ఆరోగ్యంగా ఉన్నాయి. తన సొంత బిడ్డను కనాలనే కోరికతో ఉన్న ఆమెకు వైద్యులు ఒక సాహసోపేతమైన మార్గాన్ని సూచించారు. మరణించిన ఒక దాత నుంచి సేకరించిన గర్భాశయాన్ని గ్రేస్ బెల్కు శస్త్రచికిత్స ద్వారా అమర్చారు. లండన్లోని క్వీన్ చార్లెట్ & చెల్సియా ఆసుపత్రి వైద్య బృందం ఈ అత్యంత సంక్లిష్టమైన ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసింది.
గర్భాశయ మార్పిడి తర్వాత, గ్రేస్ బెల్ గర్భం దాల్చడం, గత ఏడాది క్రిస్మస్కు ముందు ఒక పండంటి మగబిడ్డకు జన్మనివ్వడం వైద్య లోకంలో ఒక సంచలనంగా మారింది. ఆ చిన్నారికి ‘హ్యూగో’ అని పేరు పెట్టారు. యూకేలో ఇటువంటి ప్రసవం జరగడం ఇదే మొట్టమొదటిసారి. గర్భాశయం లేని ఎంతోమంది మహిళలకు ఈ విజయం కొత్త ఆశలను చిగురింపజేస్తోంది. ‘విజ్ఞాన శాస్త్రం, దాతల గొప్ప మనసు కలిస్తే ప్రాణం పోయగలవు’ అనడానికి ఈ ఘటనే నిదర్శనం. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు.
