NTV Telugu Site icon

Ghulam Nabi Azad: పార్టీ పేరు, జెండాను ప్రకటించిన గులాంనబీ ఆజాద్‌

Democratic Azad Party

Democratic Azad Party

Ghulam nabi Azad: కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకున్న గులాంనబీ ఆజాద్‌ ఎట్టకేలకు తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. తన పార్టీ పేరుతో పాటు జెండాను కూడా ప్రకటించారు. జమ్మూలో తన మద్దతుదారులతో కలిసి పార్టీ పేరును ఖరారు చేశారు. తన కొత్త పార్టీ కోసం దాదాపు 1,500 మంది పేర్లను ఉర్దూ, సంస్కృతంలో తమకు పంపారన్నారు. ఈ పేరు ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా, స్వతంత్రంగా ఉండాలని తాము కోరుకుంటున్నామన్నారు. ఈ నేపథ్యం తన కొత్త పార్టీకి “డెమోక్రటిక్ ఆజాద్‌ పార్టీ” అనే పేరును ఖరారు చేశారు. మీడియా సమావేశంలో ఈ పేరును వెల్లడించారు. కాంగ్రెస్‌తో తెగ‌దెంపులు చేసుకున్న త‌ర్వాత ప‌లువురు నేత‌లు, పార్టీల‌తో సంప్రదింపులు జ‌రిపిన మీద‌ట నెల‌రోజుల త‌ర్వాత ఆజాద్‌ కొత్త పార్టీతో ప్రజ‌ల ముందుకొచ్చారు. త‌మ పార్టీ స్వతంత్ర ఆలోచ‌న‌లు, సిద్ధాంతాల‌తో ప్రజాస్వామిక పునాదుల‌పై పార్టీ నడుస్తుందని చెప్పుకొచ్చారు. పార్టీ పేరును వెల్లడించే ముందు ఆదివారం ఆయ‌న పార్టీ నేత‌లు, కార్యక‌ర్తల‌తో సుదీర్ఘ మంత‌నాలు జ‌రిపారు. త‌మ పార్టీ మ‌తం, కులం ఆధారంగా రాజ‌కీయాలు చేయ‌ద‌ని చెప్పుకొచ్చారు.

గులాం నబీ ఆజాద్ తన కొత్త ‘డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ’ జెండాను కూడా ఆవిష్కరించారు. పసుపు, తెలుపు, నీలం మూడు రంగులతో ఆ జెండా ఉంది. పసుపు రంగు సృజనాత్మకత భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచిస్తుందని, తెలుపు శాంతిని సూచిస్తుందని, నీలం స్వేచ్ఛకు ప్రతీక అని గులాంబీ నబీ ఆజాద్ ప్రకటించారు. గాంధీ సిద్ధాంతాల‌కు అనుగుణంగా త‌మ పార్టీ ప‌నిచేస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. జ‌మ్ము క‌శ్మీర్‌కు పూర్తిస్ధాయి రాష్ట్ర హోదా సాధ‌నపై దృష్టిసారించేందుకు సొంత రాజ‌కీయ పార్టీని ఏర్పాటు చేస్తామ‌ని గతంలో జ‌మ్ములో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ఆజాద్ పేర్కొన్నారు.

Rules Changed: సామాన్యులకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి మారనున్న నిబంధనలు

73 ఏళ్ల ఆజాద్ ఆగస్టు 26న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఐదు దశాబ్దాల బంధాన్ని తెంచుకొని కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చిన గులాం నబీ ఆజాద్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. పార్టీలో ఎలాంటి కీలక పదవిలో లేనప్పటికీ.. అన్ని నిర్ణయాలు రాహులే తీసుకుంటారని విమర్శించారు. ఆయన కాంగ్రెస్‌ పార్టీలో క్రియాశీలకంగా మారిన తర్వాతే పార్టీ పతనం ప్రారంభమైందంటూ ఘాటు విమర్శలు చేశారు. ఆజాద్‌కు మద్దతుగా జమ్మూకశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి తారాచంద్ సహా సుమారు 12 మంది ప్రముఖ కాంగ్రెస్ నేతలు కూడా ఆ పార్టీకి రాజీనామా చేశారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరించడం, ఇక్కడి స్థానికుల భూమి, ఉద్యోగ హక్కుల పరిరక్షణ తమ పార్టీ ప్రధాన ఎజెండా కానుందని ఆజాద్ ఇప్పటికే తెలియజేశారు.