Deadly Virus Outbreak in Gaza: గాజా-ఇజ్రాయెల్ యుద్ధంలో పెద్ద ఎత్తున మానవీయ సంక్షోభం ఏర్పడింది. అనేక మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. గాజాలో ప్రజలు ఆకలితో చనిపోతున్నారని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుపై అంతర్జాతీయంగా ఒత్తిడి వచ్చినప్పుడల్లా, ఆయన దానిని పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ రోజురోజుకు గాజా వాస్తవికత చాలా భయంకరమైనదిగా మారుతోంది. ఇక్కడి ప్రజలు పోషకాహార లోపం కారణంగా తీవ్రమైన వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రస్తుతం గాజాలో ఒక ప్రమాదకరమైన వైరస్ వ్యాప్తి చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వ్యాధికి గాజాలో దాదాపు చికిత్స అందజేయలేని పరిస్థితి నెలకొంది. అసలు ఇంతకీ ఆ వ్యాధి ఏంటి, గాజా పరిస్థితి ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ MORE: Rajahmundry: రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మిథున్ రెడ్డితో ములాఖాత్ కానున్న జగన్!
అరుదైన సిండ్రోమ్.. చిన్నారులకు పెను ప్రమాదం..
గాజాలో ప్రస్తుతం వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వ్యాధి చిన్న పిల్లలకు పెను ప్రమాదంగా మారింది. ఇది పక్షవాతం వంటి వ్యాధులకు కారణమవుతుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. గాజాలో పిల్లలు నిరంతరం ఆకలితో ఉండటం, వారి శరీరానికి అవసరమైన విటమిన్లను అందకపోవడంతో వారు ఎక్కువగా ఈ వ్యాధికి గురవుతున్నారు. ఈ వ్యాధిని అక్యూట్ ఫ్లాసిడ్గా వైద్యులు గుర్తించారు. ఇది అరుదైన వ్యాధని, దీని కారణంగా రోగిలో కండరాలు అకస్మాత్తుగా బలహీనపడటంతో పాటు శ్వాస తీసుకోవడంలో, మింగడంలో ఇబ్బంది మొదలవుతుందని పేర్కొన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదికల ప్రకారం.. ఈ వ్యాధితో జూలై 31 నాటికి 15 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో 32 కేసులు నమోదయ్యాయి. గాజాలో ఆరోగ్య సేవల పతనం, పోషకాహార లోపం, అపరిశుభ్ర పరిస్థితులు ఈ వ్యాధికి ప్రధానమైన కారణంగా పేర్కొంది. ఈ ఏడాది పరీక్షించిన కేసుల్లో దాదాపు 70% పోలియోయేతర ఎంటరోవైరస్లు గుర్తించినట్లు తెలిపారు. అదే గతంలో ఈ సంఖ్య 26% మాత్రమే ఉండేదని తెలిపింది. వైద్యుల అభిప్రాయం ప్రకారం.. ఇజ్రాయెల్ బాంబు దాడుల కారణంగా గాజా మురుగునీటి వ్యవస్థ, పారిశుద్ధ్య వ్యవస్థలు పూర్తిగా కుప్పకూలి పోవడమే ఇటువంటి అంటు వ్యాధులు వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణంగా అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం గాజాలో అక్యూట్ ఫ్లాసిడ్ పక్షవాతం కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.
పొలిటికో నివేదిక ప్రకారం.. అక్టోబర్ 2023 కి ముందు ఈ వ్యాధి చాలా అరుదుగా ఉండేది. గతంలో ప్రతి ఏడాది కేవలం 12 కేసులు మాత్రమే నమోదయ్యేవని, కానీ గత మూడు నెలల్లో సుమారు 100 కొత్త కేసులు నమోదయ్యాయని తన నివేదికలో పేర్కొంది. జోర్డాన్, ఇజ్రాయెల్కు పంపిన ల్యాబ్ నమూనాలలో ఈ కొత్త కేసులను ఎంటరోవైరస్గా నిర్థారించారు. ఈ వైరస్ కలుషితమైన నీరు, ధూళి ద్వారా వ్యాపిస్తుందని పేర్కొన్నారు. గాజాలో గులియన్ బార్ సిండ్రోమ్ కూడా వేగంగా వ్యాప్తి చెందుతోందని తెలిపింది.
మందుల కొరత..
గాజాలో ప్రస్తుతం చికిత్సకు దాదాపు మార్గాలు లేవని వైద్యులు అంటున్నారు. 2024 ప్రారంభంలో ఇజ్రాయెల్ దాడిలో తీవ్రంగా దెబ్బతిన్న గాజాలోని అల్-షిఫా ఆసుపత్రిలో ఇప్పటివరకు 22 గుల్లెయిన్-బార్ సిండ్రోమ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే వీరిలో ముగ్గురు పిల్లలు మరణించగా, మరో 12 మంది చిన్నారులు శాశ్వత పక్షవాతానికి గురయ్యారు. ఈ వ్యాధికి ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబులిన్ (IVIG), ప్లాస్మా మార్పిడి వంటి ఆధునిక చికిత్సలు అవసరమని, కానీ ఇజ్రాయెల్ దిగ్బంధనం కారణంగా ప్రాథమిక వైద్య సామాగ్రి కూడా అందుబాటులో లేదని వైద్యులు పేర్కొంటున్నారు. కనీసం మందులు, చికిత్స యంత్రాలు కూడా అందుబాటులో లేవని తెలిపారు.
READ MORE: Dharma Mahesh: టాలీవుడ్ హీరోపై వరకట్నం కేసు?
