దేశంలోనే అతిపెద్ద జీఎస్టీ మోసాల్లో ఒకటిగా భావిస్తున్న రూ.1700 కోట్ల నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) సిండికేట్ను విశాఖపట్నం డీజీజీఐ (DGGI) అధికారులు బట్టబయలు చేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి ధంట్ల ఆది రెడ్డి అలియాస్ అంజి రెడ్డిని మే 14, 2026న అధికారులు అరెస్ట్ చేశారు.
అసాధారణ జీఎస్టీ ఫైలింగ్స్, బ్యాంక్ లావాదేవీలపై వచ్చిన సమాచారంతో అధికారులు డిజిటల్ ట్రాకింగ్, ఫీల్డ్ వెరిఫికేషన్లు జరిపారు. ఈ దర్యాప్తులో నిందితుడు ఇతరుల ఆధార్, పాన్ కార్డులను దుర్వినియోగం చేస్తూ, నకిలీ రెంటల్ అగ్రిమెంట్లతో ఏకంగా 92 నకిలీ కంపెనీలను సృష్టించినట్లు తేలింది. ఎలాంటి సరుకు లేదా సేవల సరఫరా లేకుండానే కేవలం నకిలీ ఇన్వాయిస్ల ద్వారా ఈ సిండికేట్ రూ.264 కోట్ల నకిలీ ITC పొందింది, అలాగే రూ.260 కోట్ల ఐటీసీని ఇతరులకు బదిలీ చేసింది. ఈ విధంగా మొత్తం రూ.1700 కోట్ల విలువైన మోసపూరిత లావాదేవీలు జరిగాయి.
ఈ కేసులో మార్చి 25, 2026నే సిద్ధగోని ప్రభాకర్, రామావత్ నాగరాజు నాయక్ అనే ఇద్దరు కీలక నిందితులను అధికారులు అరెస్ట్ చేశారు. అప్పటినుంచి పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు ఆది రెడ్డిని సుదీర్ఘ నిఘా తర్వాత పట్టుకున్నారు. నిందితులపై CGST చట్టం 2017 లోని పలు సెక్షన్ల కింద నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. కమిషన్ల ఆశతో తమ ఆధార్, పాన్, ఓటీపీ వంటి వ్యక్తిగత వివరాలను అపరిచితులకు ఇవ్వవద్దని అధికారులు హెచ్చరించారు. గుర్తింపు పత్రాల దుర్వినియోగం వల్ల చట్టపరమైన ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందన్నారు. ఈ భారీ కుంభకోణంపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.
