గుంటూరు జిల్లాలోని కొలనుకొండలో హరేకృష్ణ గోకుల క్షేత్రంలో అనంత శేషస్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్షయపాత్ర అంతర్జాతీయ అధ్యక్షుడు మధుపండిత్ దాస్ మాట్లాడుతూ.. పాండవులు నడయాడిన అమరావతి ప్రాంతంలో నవయుగ ధర్మరాజుగా చంద్రబాబు రాజధాని అమరావతి నిర్మాణం తలపెట్టారన్నారు. భవిష్యత్తు తరాలకోసం ఓ విజన్ తో తలపెట్టిన అమరావతి నిర్మాణానికి వెంకటేశ్వరస్వామి, దుర్గమ్మ దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తున్నా అని ఆయన తెలిపారు. ధర్మరాజు అడుగుజాడల్లోనే చంద్రబాబు రాష్ట్రానికి సుపరిపాలన అందిస్తున్నారన్నారు. తిరుమలలో ఇప్పటికే ప్రక్షాళన చేపట్టి భక్తుల మనోభావాలను కాపాడే చర్యలు ముఖ్యమంత్రి చేపట్టారని, అమరావతి ప్రపంచ ఉత్తమ నగరంగా, ఆంధ్రప్రదేశ్ ఉత్తమ రాష్ట్రంగా వెలుగొందాలని కోరుకుంటున్నా అని ఆయన తెలిపారు.
అనంతరం మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. అమరావతి నగరంలో నూతన ఆధ్యాత్మిక ఒరవడికి శ్రీకారం చుట్టటం శుభ సంకేతమన్నారు. దేవాలయాల్లో కూడా రాజకీయాలు చొరబడి, ఆలయాలు నిర్మించకుండా చేసిన ప్రభుత్వాలను మనం చూశామని, దేవుడు ఉన్నాడు కాబట్టే ఎన్నో అవరాధాలు అధిగమించి గోకుల క్షేత్రం నిర్మాణానికి చంద్రబాబు సారధ్యంలో మార్గం సుగమమైందన్నారు ఎన్వీ రమణ. సమాజంలో ఆధ్యాత్మికతతో పాటు సంస్కృతి, ఆచార వ్యవహారాలను కాపాడటం ఎంతో ముఖ్యమని, ఇందులో ఇస్కాన్ సంస్థ ముందుండటంతో పాటు ఎంతోమందికి అన్నదానం కూడా చేస్తోందన్నారు జస్టిస్ ఎన్వీ రమణ. రానున్న రోజుల్లో అన్న క్యాంటీన్లను చంద్రబాబు ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించుడటం శుభపరిణామమని, అక్షయపాత్ర ద్వారా గతంలో అన్న క్యాంటీన్లకు ఇస్కాన్ సంస్థ ఎంతో తోడ్పాటునిచ్చిందన్నారు. ఎవరూ అర్థాకలితో ఉండకూడదనే లక్ష్యంతో ఇస్కాన్ సంస్థ ఎంతో మందికి అక్షయపాత్ర ద్వారా అన్నదానం చేస్తోందన్నారు ఎన్వీ రమణ.