NTV Telugu Site icon

Indo-Pak: “అబీ పిక్చర్ బాకీ హై” భారత ఆర్మీ మాజీ చీఫ్ సంచలన పోస్ట్

Manoj Naravane

Manoj Naravane

భారత ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ నరవాణే బుధవారం సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ చేశారు. ఆపరేషన్ సిందూర్ అనేది భారతదేశం చేపట్టిన ఒక చిన్న ఆపరేషన్ మాత్రమే అని అర్థం వచ్చేలా పోస్ట్‌లో పేర్కొన్నారు. భారత సైన్యం 28వ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ మనోజ్ నరవాణే, పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ తర్వాత సోషల్ సైట్ ఎక్స్‌లో “సినిమా ఇంకా మిగిలి ఉంది” అని రాసుకొచ్చారు. ఆపరేషన్ సిందూర్ కింద పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లను లక్ష్యంగా చేసుకుని భారత రక్షణ దళాలు వైమానిక దాడులు నిర్వహించిన కొన్ని గంటల తర్వాత మనోజ్ నరవాణే ఈ ప్రకటన చేశారు. దీంతో ఇప్పుడు పాకిస్థాన్ లో టెన్షన్ మొదలైంది.

READ MORE: Operation Sindoor: పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, పీఎం షెహబాజ్ షరీఫ్ అడ్డానే కొట్టి వచ్చాం..

మరోవైపు పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ, ఇతర ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశాలు నిర్వహించారు. ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకోవాలని పాకిస్థాన్ ప్రభుత్వం సైనిక దళాలను కోరింది. భారత సైనిక చర్యకు ప్రతిస్పందనగా, పాకిస్థాన్ భారతీయ దౌత్యవేత్తను పిలిచి, నిరసన తెలియజేసింది. భారత దాడులకు ప్రతీకారం తీర్చుకునే హక్కు పాకిస్థాన్ ‌కి ఉందని ఆ దేశ సమాచార మంత్రి అతుల్లా తరార్ తీవ్రంగా స్పందించారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ ‘‘కఠినమైన యుద్ధ చర్య’’కు పాల్పడిందని పాక్ ఆరోపించింది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. పాకిస్తాన్ పీఎం షహాబాజ్ షరీఫ్ బుధవారం జాతీయ ప్రసంగానికి ముందు అత్యవసర జాతీయ భద్రతా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భారత్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఎక్కువ సమయం పట్టదని, ఇప్పటికే సైనిక కార్యకలాపాలు జరుగుతున్నాయని అన్నారు.