Hyderabad: సైబరాబాద్ పరిధిలోని జూబ్లీ ఎన్క్లేవ్లో గల ప్రముఖ ‘లా పినోజ్ పిజ్జా’ (La Pino’z Pizza) సెంటర్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. బ్రాండెడ్ పిజ్జాల పేరుతో కస్టమర్ల నుంచి భారీగా వసూలు చేస్తూ, తెరవెనుక ప్రజల ఆరోగ్యంతో ఎంతలా చెలగాటమాడుతున్నారో ఈ తనిఖీల్లో బయటపడింది. నిత్యం వందలాది మంది భోజనప్రియులు నమ్మకంతో వచ్చే ఈ పిజ్జా సెంటర్ కిచెన్, స్టోరేజ్ ఏరియాల్లో కనీస పరిశుభ్రత ప్రమాణాలు పాటించకపోవడంపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యంగా రెస్టారెంట్ లోపల నిర్వహణ లోపాలు అధికారులనే షాక్కు గురిచేశాయి. పిజ్జా సెంటర్లో భారీగా బొద్దింకలు విచ్చలవిడిగా తిరుగుతుండటం గమనార్హం. అంతేకాకుండా, వంటకాలకు రుచిని ఇచ్చే ఫ్రీజర్ను తెరిచి చూసిన అధికారులకు అందులో పురుగులు తిరుగుతూ కనిపించాయి. ఆహార పదార్థాలను నిల్వ ఉంచే ప్రధాన ప్రాంతంలో ఏకంగా బల్లులు తిరుగుతుండటాన్ని అధికారులు గుర్తించారు. కస్టమర్లకు వడ్డించే చికెన్ను కనీసం సరైన రీతిలో ప్యాకింగ్ చేయకుండా అత్యంత నిర్లక్ష్యంగా నిల్వ ఉంచారు. వీటన్నింటికీ తోడు వెజ్, నాన్వెజ్ పదార్థాలను విడివిడిగా ఉంచకుండా, ఒకే ఫ్రీజర్లో కలిపి నిల్వ చేయడం గుర్తించారు.
మరోవైపు, ప్రజల ప్రాణాలను పణంగా పెడుతూ ఇక్కడ ఎక్స్పైరీ డేట్ దాటిన మసాలా మిక్స్లు, ఫ్లేవర్డ్ సిరప్స్, బ్రెడ్ ఉత్పత్తులను యథేచ్ఛగా వినియోగిస్తున్నట్లు అధికారులు కనుగొన్నారు. అక్కడ నిల్వ ఉంచిన చాలా ఆహార పదార్థాలపై ఎలాంటి లేబులింగ్ (తయారీ, గడువు తేదీలు) లేదు. ఇక ఇక్కడ పనిచేసే ఫుడ్ హ్యాండ్లర్లకు సంబంధించిన మెడికల్ ఫిట్నెస్ రికార్డులు గానీ, వంటకు వాడుతున్న నీటి నాణ్యత పరీక్ష నివేదికలు గానీ యాజమాన్యం అధికారులకు చూపించలేకపోయింది. ఈ తీవ్ర ఉల్లంఘనల నేపథ్యంలో.. గడువు ముగిసిన, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆహార పదార్థాలన్నింటినీ అధికారులు అక్కడికక్కడే పారబోసి ధ్వంసం చేశారు. హోటల్లో తక్షణమే డీప్ క్లీనింగ్, పెస్ట్ కంట్రోల్ చర్యలు చేపట్టాలని ఆదేశిస్తూ, లా పినోజ్ పిజ్జా యాజమాన్యానికి అధికారులు కఠిన నోటీసులు జారీ చేశారు.

