Fake IPS Officer: మేడ్చల్ జిల్లాలో సంచలనం సృష్టించిన నకిలీ పోలీస్ ముఠా గుట్టును కూకట్పల్లి సీసీఎస్, జగద్గిరిగుట్ట పోలీసులు రట్టు చేశారు. తాను ఐపీఎస్ అధికారినని చెప్పుకుంటూ అమాయకులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న ప్రధాన నిందితుడు నాగరాజుతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ ఐపీఎస్ అధికారి పేరుతో నాగరాజు ఓ ముఠాను నడుపుతున్నాడు. ఈ ముఠాలో పాత నేరస్థులతో పాటు ఓ కానిస్టేబుల్ కూడా ఉండగా.. అతడి సహకారంతో ఆరుగురు సభ్యులతో ప్రత్యేకంగా “సూడో పోలీస్ వ్యవస్థ”ను ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న కానిస్టేబుల్ను విధుల నుంచి డిస్మిస్ చేసారు అధికారులు. గత నెలలో పూర్ణచందర్ రావు (42) అనే వ్యక్తిని తాను ఐపీఎస్ అధికారినని నమ్మించి నాగరాజు ముఠా కిడ్నాప్ చేసింది. ఆ తర్వాత తమ వద్ద ఉన్న నకిలీ పోలీస్ వాహనంలో అతడిని సూర్యాపేటకు తీసుకెళ్లి బెదిరింపులకు పాల్పడింది. అక్కడ బాధితుడి నుంచి రూ.1 లక్ష నగదు వసూలు చేసిన నిందితులు, తర్వాత హైదరాబాద్కు తీసుకొచ్చి వదిలిపెట్టారు. అయితే మరో రూ.5.26 లక్షలు కూడా కాజేసి పరారైనట్లు పోలీసులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు టెక్నాలజీ సహాయంతో దర్యాప్తు చేపట్టారు. పాత నేరస్థుల డేటాబేస్ను పరిశీలించి నిందితుల ఆచూకీ కనుగొని వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు నాగరాజుతో పాటు రాహుల్, సత్యభాన్ సింగ్, నాగేంద్రవర్మలను అరెస్ట్ చేశారు. ప్రదీప్ కుమార్ మిశ్రా, సునీల్ కుమార్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై ఇప్పటికే అనేక క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని వెల్లడించారు. నాగరాజుపై 12 కేసులతో పాటు రెండు పీడీ యాక్ట్ కేసులు, ఒక రౌడీషీట్ కూడా ఉన్నట్లు డీసీపీ తెలిపారు. నిందితుల వద్ద నుంచి రెండు తుపాకులు (ఎయిర్ పిస్టల్, కంట్రీమేడ్ పిస్టల్), ల్యాప్టాప్, పోలీస్ యూనిఫాంలు, కారు, బైక్, లెటర్ ప్యాడ్లు, బేడీలు, పలు రబ్బర్ స్టాంపులు, 10 మొబైల్ ఫోన్లు, పోలీస్ హోదాలను సూచించే స్టార్లు, గుర్తులు తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తున్నట్లు కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి వెల్లడించారు. ఈ ఘటనతో నకిలీ పోలీసుల పేరుతో జరుగుతున్న మోసాలపై పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
