పచ్చని సంసారంలో చిచ్చు రేగుతోంది. ఈమధ్యకాలంలో వివాహేతర సంబంధాలు ఎక్కువైపోయాయి. భార్యాభర్తలు ఒకరినొకరు నమ్మకంతో ఉండాలి. అయితే ప్రియుడి మోజులో పడో, ప్రియురాలిని నమ్మి తమ సంసారాలను నాశనం చేసుకుంటున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఓ వివాహేతర సంబంధం హత్యకు దారితీసింది. ప్రియుడిని హత్య చేసి కటకటలపాలైంది ఓ ప్రియురాలు… ఆరేళ్లు కలిసి ప్రయాణం చేసాం… ఎందుకు దూరం పెడుతున్నావంటూ ప్రశ్నించిన ఆ ప్రియుడు హత్యకు గురైయ్యాడు. ఈ హత్య ఇరుకుటుంబాలను రోడ్డున పడేసింది.
విజయవాడ రామవరప్పాడు రైవస్ కాల్వకట్టపై నివాసం ఉంటున్న మీసాల లక్ష్మి, చిన్ని నాయుడులకు 18 సంవత్సరాల క్రితం వివాహం అయింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త చిన్ని నాయుడు తాపీ పనికి వెళుతుంటాడు. ఇదే క్రమంలో అదే ప్రాంతానికి చెందిన రమణ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్త వీరి మధ్య వివాహేతర బందానికి దారితీసింది. లక్ష్మి కంటే రమణ వయస్సులో చిన్నవాడు. రమణ తాపీ పనులు చేసుకుంటూ అదే కాలనీలో లక్ష్మి ఇంటికి సమీపంలోని తన భార్యతో కలిసి ఉంటున్నాడు. రమణకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత ఆరేళ్లుగా లక్ష్మి, రమణల వివాహేతర సంబంధం కొనసాగుతుంది. ఈ నేపధ్యంలో లక్ష్మి ఒక్కసారిగా రమణను దూరం పెట్టింది. లక్ష్మి ఒక్కసారిగా దూరం పెటడంతో పలుమార్లు వీరి మధ్య గొడవలు తల్లెత్తాయి.. ఈ పంచాయితీ పలుసార్లు పోలీస్ స్టేషన్ కు చేరింది.
Read Also: Roman City : ఈజిప్టులో అతి పురాతన రోమన్ నగరాన్ని కనుగొన్న ఆర్కియాలజిస్టులు
స్దానిక పటమట పోలీస్ స్టేషన్ లో తనను వేధిస్తున్నారని లక్ష్మి గతంలో పలుసార్లు ఫిర్యాదు చేసింది. తరచూ మద్యం సేవించి లక్ష్మి ఇంటికి వెళ్లి రమణ గొడవలకు పాల్పడుతుండేవాడు.. గత కొంత కాలంగా వీరిద్దరు విడివిడా ఉంటున్నారు. బుధవారం ఫోన్ చేస్తే లక్ష్మి ఇంటికి వెళ్లిన రమణ పై దాడి జరగడంతో రమణను ప్రభుత్వసుపత్రికి తరలించారు. లక్ష్మి చేతిలో ఉన్న కూరగాయలు కోసే కత్తితో రమణ పొట్టలో పొడిచిందని రమణ బంధువులు అంటున్నారు. గాయాలపాలైన రమణ విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. లక్ష్మిపై హత్య కేసు నమోదు చేసుకున్న పటమట పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
తన భర్త రమణను ఉద్దేశపూర్వకంగానే పథకం ప్రకారం లక్ష్మి హతమార్చిందని, భార్య సౌందర్య ఆగ్రహం వ్యక్తం చేసింది. తరచూ గొడవలు అయినపుడు తన భర్తపై పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టేదని మరలా ఆమె ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేదని మృతుడి భార్య అంటోంది. అన్యాయంగా రమణను పొట్టన పెట్టుకుందని రమణ బంధువులు వాపోతున్నారు. ఎలాగైనా తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు.
Read Also: Budget and Startups: కేంద్ర బడ్జెట్.. స్టార్టప్లకు ఏమిస్తుంది?