EPFO కీలక నిర్ణయం.. 51 లక్షల మందికి పైగా ఉద్యోగులకు ప్రయోజనం

Epfo

Epfo

EPFO Wage Ceiling: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది.. ఇక, EPFOపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తప్పనిసరి EPFO పరిధిలోకి వచ్చే వేతన పరిమితిని నెలకు రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచింది. ఈ నిర్ణయంతో అదనంగా 51 లక్షల మందికి పైగా ఉద్యోగులు తప్పనిసరి EPFO కవరేజీలోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే, ప్రస్తుతం నెలకు రూ.15,000 కంటే ఎక్కువ వేతనంతో ఉద్యోగంలో చేరే కొత్త ఉద్యోగులు ఆటోమేటిక్‌గా తప్పనిసరి EPF పరిధిలోకి రావడం లేదు. దీంతో కొందరు ఉద్యోగులు ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, అనుబంధ బీమా వంటి సామాజిక భద్రత ప్రయోజనాలకు దూరంగా ఉండే పరిస్థితి ఉంది. తాజాగా వేతన పరిమితిని రూ.25,000కు పెంచడంతో రూ.15,000 నుంచి రూ.25,000 మధ్య వేతనం పొందే ఉద్యోగుల్లో మరింత మంది చట్టబద్ధమైన సామాజిక భద్రత వ్యవస్థలోకి వస్తారు.

ఇప్పటికే రూ.25,000 కంటే ఎక్కువ జీతం ఉన్న ఉద్యోగులకు ఏం మారుతుంది?
రూ.25,000 కంటే ఎక్కువ బేసిక్ జీతం పొందుతున్న ఇప్పటికే ఉన్న ఉద్యోగుల విషయంలో కూడా ఈ మార్పు ప్రభావం చూపనుంది. ఇకపై EPF చందాలు పెంచిన వేతన పరిమితి ఆధారంగా లెక్కించే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఉద్యోగుల రిటైర్మెంట్ పొదుపు పెరుగుతుంది. అయితే ప్రతి నెల చేతికి వచ్చే జీతంలో స్వల్పంగా తగ్గుదల ఉండొచ్చు.

నెలకు ఎంత అదనంగా చెల్లించాలి..?
ప్రస్తుతం రూ.15,000 వేతన పరిమితి ఆధారంగా ఉద్యోగి వాటా 12 శాతం అంటే నెలకు గరిష్ఠంగా రూ.1,800గా ఉంది. కొత్తగా పరిమితిని రూ.25,000కు పెంచడంతో 12 శాతం లెక్కన ఉద్యోగి వాటా నెలకు రూ.3,000కు చేరుతుంది. అంటే ప్రస్తుత గరిష్ఠ చందాతో పోలిస్తే నెలకు రూ.1,200 అదనంగా EPFలో జమ అవుతుంది. ఈ అదనపు చందా కారణంగా తక్షణ టేక్-హోమ్ జీతం కొంత తగ్గినప్పటికీ, దీర్ఘకాలంలో రిటైర్మెంట్ కార్పస్ పెరగడానికి ఇది దోహదపడనుంది.. ఉద్యోగుల భవిష్యత్ ఆర్థిక భద్రత కోసం యజమానులు కూడా సహకరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల వర్గాలన్నింటికీ ఈ మార్పు అధిక పొదుపు వైపు క్రమబద్ధమైన మార్పును తీసుకురాగలదని పేర్కొన్నారు.

EPFO వేతన పరిమితి చివరిసారిగా ఎప్పుడు పెరిగింది?
EPFO వేతన పరిమితి 2004 నుంచి 2014 వరకు ఎలాంటి మార్పు లేకుండా కొనసాగింది. అనంతరం 2014 సెప్టెంబర్‌లో దీనిని రూ.15,000కు పెంచారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి వేతన పరిమితిని రూ.25,000కు పెంచారు.

ప్రభుత్వంపై అదనపు భారం ఎంత?
EPFO వేతన పరిమితి పెంపు అమలుకు కేంద్ర ప్రభుత్వం అదనంగా రూ.11,339 కోట్ల వ్యయం చేయనుంది. ఐదేళ్ల కాలంలో ఈ పథకానికి సుమారు రూ.56,696 కోట్ల అదనపు వ్యయం అవుతుందని అంచనా. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతి ఏడాది సుమారు రూ.10,250 కోట్ల బడ్జెట్‌ మద్దతును అందిస్తోంది. మొత్తంగా చూస్తే, EPFO వేతన పరిమితి పెంపుతో రూ.15,000 నుంచి రూ.25,000 మధ్య వేతనం పొందే కొత్త ఉద్యోగులకు సామాజిక భద్రత పరిధి విస్తరించనుంది. అదే సమయంలో ఇప్పటికే అధిక వేతనాలు పొందుతున్న ఉద్యోగులకు EPF చందా పెరిగే అవకాశం ఉండటంతో తక్షణ టేక్-హోమ్ జీతంపై స్వల్ప ప్రభావం పడినా, దీర్ఘకాలిక రిటైర్మెంట్ పొదుపు పెరిగే అవకాశం ఉంది.