ENG W vs IND W: ఇంగ్లాండ్ మహిళలతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత మహిళల జట్టు 38 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. చెమ్స్ఫోర్డ్లోని కౌంటీ గ్రౌండ్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్లో పేసర్ నందిని శర్మ తన డెబ్యూతోనే చరిత్ర సృష్టించింది. మూడు వికెట్లు పడగొట్టి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆమె, టీ20 అంతర్జాతీయ అరంగేట్రంలో మూడు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన రెండో భారత మహిళా పేసర్గా అరుదైన ఘనత సాధించింది. గతంలో ఈ ఫీట్ను సోనియా దబీర్ మాత్రమే అందుకుంది.
ఈ మ్యాచ్కు భారత జట్టుకు రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ విశ్రాంతి తీసుకోవడంతో జట్టు స్వల్ప మార్పులతో బరిలోకి దిగింది. అయితే మ్యాచ్ ప్రారంభంలోనే భారత్కు భారీ షాక్ తగిలింది. తొలి ఓవర్ లోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ ఆ తర్వాత జెమిమా రోడ్రిగ్స్, యాస్తిక భాటియా అద్భుత భాగస్వామ్యంతో ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. యాస్తిక భాటియా ప్రారంభం నుంచే దూకుడుగా ఆడింది. ఇస్సీ వాంగ్ వేసిన రెండో ఓవర్లో నాలుగు ఫోర్లు బాది మొత్తం 27 పరుగులు రాబట్టింది. ఆ ఓవర్లో ఎక్స్ట్రాల రూపంలో కూడా ఇంగ్లాండ్ భారీగా పరుగులు ఇచ్చింది. ఈ ఊపు కొనసాగించిన జెమిమా-యాస్తిక జోడీ మూడో వికెట్కు 126 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఇది టీ20ల్లో ఇంగ్లాండ్పై భారత్ మహిళల జట్టుకు రెండో అత్యధిక భాగస్వామ్యంగా నిలిచింది. 2018లో స్మృతి మంధానా-మిథాలీ రాజ్ జోడీ నెలకొల్పిన 129 పరుగుల రికార్డు మాత్రమే దీనికంటే ముందుంది.
జెమిమా రోడ్రిగ్స్ 69 పరుగులు, యాస్తిక భాటియా 54 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. అయితే 14వ ఓవర్లో చార్లీ డీన్ బౌలింగ్లో ఇద్దరూ వరుసగా అవుట్ కావడంతో భారత్ కొంత ఒత్తిడిలో పడింది. ఈ సమయంలో దీప్తి శర్మ 13 బంతుల్లో 22 పరుగులు చేసి జట్టుకు చివర్లో కీలక పరుగులు అందించింది. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 188/7 భారీ స్కోరు నమోదు చేసింది.
189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్కు భారత బౌలర్లు ప్రారంభం నుంచే కట్టుదిట్టమైన బౌలింగ్ చేశారు. పవర్ప్లేలోనే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ను అమీ జోన్స్ కొంతవరకు ఆదుకునే ప్రయత్నం చేసింది. ఆమెతో కలిసి హీథర్ నైట్ మూడో వికెట్కు 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పినా, నైట్ మాత్రం 24 బంతుల్లో కేవలం 21 పరుగులే చేసింది. ఈ కీలక సమయంలో శ్రేయ చరణి హీథర్ నైట్ను ఔట్ చేసి భారత్కు బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత నందిని శర్మ వరుస వికెట్లతో ఇంగ్లాండ్ ఆశలను పూర్తిగా దెబ్బతీసింది. అమీ జోన్స్ వికెట్ తీసిన ఆమె, వెంటనే డానియెల్ గిబ్సన్ను గోల్డెన్ డక్గా పెవిలియన్ చేర్చింది. చివర్లో ఇస్సీ వాంగ్ వికెట్ కూడా తన ఖాతాలో వేసుకుని మూడు వికెట్లతో రికార్డ్ సృష్టించింది. దీంతో ఇంగ్లాండ్ జట్టు లక్ష్యానికి 38 పరుగుల దూరంలోనే ఆలౌట్ అయింది. చెమ్స్ఫోర్డ్ వేదికపై ఇంగ్లాండ్కు ఇది 15 టీ20ల్లో కేవలం మూడో ఓటమి మాత్రమే. ఈ విజయంతో మూడు మ్యాచ్ల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.
