Site icon NTV Telugu

Minister Kandula Durgesh: పవన్ కల్యాణ్‌ ఆలోచన మేరకు ఏకో టూరిజం అభివృద్ధి.. సినిమా టూరిజం డెవలప్‌మెంట్‌పై ఫోకస్‌..

Kandula Durgesh

Kandula Durgesh

Minister Kandula Durgesh: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆలోచన మేరకు రాష్ట్రంలో ఏకో టూరిజం అభివృద్ధి చేస్తున్నాం.. సినిమా టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పర్యాటక రంగానికి బ్రాండ్ ఇమేజ్ పెంచడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని మంత్రి తెలిపారు. ఇందుకోసం సుమారు రూ.150 కోట్ల పెట్టుబడులు ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. సినిమా టూరిజం అభివృద్ధి ద్వారా రాష్ట్రానికి కొత్త గుర్తింపు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.

కేరళ తరహాలో హౌస్ బోట్లు
ఇక, కేరళ మోడల్‌ను అనుసరిస్తూ రాజమండ్రి, విజయవాడ నగరాల్లో హౌస్ బోట్లను ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది అని కందుల దుర్గేష్ తెలిపారు. గోదావరి నదిని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసి దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యమన్నారు. అయితే, గత వైసీపీ పాలనలో పర్యాటక రంగం పూర్తిగా నాశనమైందని మంత్రి విమర్శించారు. టూరిజంతో పాటు కళాకారులను కూడా మోసం చేశారని ఆరోపించారు. కళలను, కళాకారులను ప్రోత్సహించేందుకు ఇకపై ఉగాది అవార్డులు అందజేస్తామని ప్రకటించారు.

20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం
రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని తెలిపారు మంత్రి కందుల దుర్గేష్‌… ఇందులో అధిక శాతం ఉద్యోగాలు పర్యాటక శాఖ ద్వారా కల్పించాలన్నదే పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు ప్రభుత్వ సంకల్పం అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా సాగుతోందని మంత్రి అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతోందన్నారు.

అమరావతిలో క్వాంటమ్ వాలీ
హైదరాబాద్‌లో హైటెక్ సిటీ తరహాలో అమరావతిలో ‘క్వాంటమ్ వాలీ’ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయని తెలిపారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో రూ.428 కోట్ల పెట్టుబడులు సమకూర్చినట్లు చెప్పారు. మరోవైపు.. 2027 జూన్ 26 నుంచి 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని మంత్రి ప్రకటించారు. గోదావరి నది పొడవున ఎక్కడ స్నానం చేసినా పుష్కర పుణ్యం లభిస్తుందనే విధంగా ప్రచారం చేస్తామని తెలిపారు. టూరిజం, ఉపాధి, ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేస్తోందని ఈ సందర్భంగా కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.

Exit mobile version