Telangana Elections 2023: తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రారంభం!

Ec Logo

Ec Logo

Telangana Elections 2023: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పర్వం మంగళవారం సాయంత్రం ముగిసింది. గురువారం (నవంబర్ 30) పోలింగ్ డే. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) అన్ని ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. డీఆర్‌సీ కేంద్రాలకు పోలింగ్‌ సిబ్బంది చేరుకుంటున్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌లతో పాటు ఇతర సామగ్రిని అధికారులు పోలింగ్‌ సిబ్బందికి అందజేస్తున్నారు. బుధవారం సాయంత్రం లోపు పోలింగ్‌ సిబ్బంది కేంద్రాలకు చేరుకోనున్నారు.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్‌ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. 27,094 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికల విధుల్లో 1.85 లక్షల మంది విద్యార్థులు పాల్గొననున్నారు. పోలింగ్‌ ప్రక్రియ పరిశీలనకు 22వేల మంది అబ్జర్వర్లు, స్క్వాడ్లను అధికారులు నియమించారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఓటు వేసే వారు 5 గంటల లోపు పోలింగ్‌ కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఆలస్యం అయితే లోపలికి అనుమతి ఉండదు.