DY Chandrachud: భారతదేశ పూర్వ ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్ అంతర్జాతీయ న్యాయ వేదికపై ఒక కీలకమైన బాధ్యతను స్వీకరించనున్నారు. ఉక్రెయిన్ ప్రభుత్వ యాజమాన్యంలోని ‘ఓస్చాడ్బ్యాంక్’ (Oschadbank) రష్యాపై దాఖలు చేసిన భారీ అంతర్జాతీయ వివాదంలో రష్యా దేశం తరఫున ఆయన ఆర్బిట్రేటర్గా ప్రాతినిధ్యం వహించనున్నారు. ‘గ్లోబల్ ఆర్బిట్రేషన్ రివ్యూ’ నివేదికను ఉటంకిస్తూ బార్ అండ్ బెంచ్ ఈ వివరాలను వెల్లడించింది. 2022లో ఉక్రెయిన్పై రష్యా జరిపిన పూర్తిస్థాయి సైనిక చర్యల కారణంగా డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, జపోరిజియా ప్రాంతాల్లోని తమ వ్యాపార కార్యకలాపాలు, ఆస్తులను పూర్తిగా కోల్పోయామని ఓస్చాడ్బ్యాంక్ ఆరోపిస్తోంది. దీనివల్ల తమకు వందల మిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లిందని తెలిపింది. 1998 నాటి రష్యా-ఉక్రెయిన్ ద్విపాక్షిక పెట్టుబడుల ఒప్పందం (BIT) కింద ఈ వివాదాన్ని పరిష్కరించాలని బ్యాంక్ కోరింది. జూలై 2025లో తాము పంపిన లీగల్ నోటీసుకు రష్యా నుంచి స్పందన రాకపోవడంతో ఓస్చాడ్బ్యాంక్ ఈ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించింది.
ఈ అంతర్జాతీయ వివాదాన్ని విచారించడానికి ముగ్గురు సభ్యులతో కూడిన ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేశారు. కోస్టారికా మాజీ వాణిజ్య మంత్రి, ప్రముఖ ఆర్బిట్రేటర్ డయాలా జిమెనెజ్ను రష్యా, ఓస్చాడ్బ్యాంక్ ఉమ్మడిగా ఈ ట్రిబ్యునల్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నాయి. అలాగే గ్రీక్ ఆర్బిట్రేటర్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రొఫెసర్ స్టావ్రోస్ బ్రేకౌలాకిస్ను ఓస్చాడ్బ్యాంక్ తమ ప్రతినిధిగా ఎంపిక చేసుకోగా, రష్యా తన ప్రతినిధిగా భారత మాజీ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ను నియమించుకుంది. గతంలో వింటర్షాల్ డియా (ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ), ఉక్రెనెర్గో (పవర్ ట్రాన్స్మిషన్ సంస్థ) వివాదాల్లో కూడా తమ తరఫున ఆర్బిట్రేటర్గా వ్యవహరించాలని రష్యా కోరినప్పటికీ జస్టిస్ చంద్రచూడ్ ఆ విజ్ఞప్తులను తిరస్కరించారు. అయితే ప్రస్తుత ఓస్చాడ్బ్యాంక్ కేసులో రష్యా చేసిన విజ్ఞప్తిని అంగీకరించి ఆయన ఈ కీలక బాధ్యతను చేపట్టడం విశేషం.

