NTV Telugu Site icon

Team India: డబుల్ ధమాకా.. టీమిండియాకు ఆ ఇద్దరే కీలకం: దినేశ్‌ కార్తిక్

Team India T20

Team India T20

ఏ జట్టుకైనా అత్యుత్తమ ఫినిషర్‌ అవసరం కానీ.. టీమిండియాకు మాత్రం డబుల్ ధమాకా లాంటి ఇద్దరు ఫినిషర్లు ఉన్నారని భారత మాజీ క్రికెటర్ దినేశ్‌ కార్తిక్ పేర్కొన్నాడు. మిడిలార్డర్‌లో హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్ బెస్ట్ ఫినిషర్లు అవుతారన్నాడు. వచ్చే ఛాంపియన్స్‌ ట్రోఫీ, టీ20 ప్రపంచకప్‌లో ఈ ఇద్దరు అత్యంత కీలక పాత్ర పోషిస్తారని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఉన్న క్రికెటర్లలో ఆల్‌ ఫార్మాట్‌ బెస్ట్‌ బ్యాటర్‌ ట్రావిస్ హెడ్‌ అని డీకే చెప్పుకొచ్చాడు.

నేడు బంగ్లాదేశ్‌తో భారత్ టీ20 సిరీస్‌ ఆడబోతోంది. గ్వాలియర్ వేదికగా రాత్రి 7.30కు మొదటి మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో క్రిక్‌బజ్‌తో దినేశ్‌ కార్తిక్ మాట్లాడుతూ… ‘ఏ జట్టుకైనా అత్యుత్తమ ఫినిషర్‌ అవసరం. కానీ భారత్‌కు మాత్రం డబుల్ ధమాకా అనే చెప్పాలి.
హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్ బెస్ట్ ఫినిషర్లు. వచ్చే ఛాంపియన్స్‌ ట్రోఫీ, టీ20 ప్రపంచకప్‌లో ఈ ఇద్దరే కీలకం. హార్దిక్‌ గురించి చెప్పాల్సిన అసవరం లేదు. ఎన్నో మ్యాచుల్లో జట్టును గెలిపించాడు. ఇన్నింగ్స్ చివర్లో దూకుడుగా ఆడాల్సిన బ్యాటర్లు జట్టుకు అవసరం. రియాన్ అలాంటి ఆటగాడే. బౌలింగ్‌లోనూ మ్యాజిక్‌ చేయగల సమర్థుడు. అందుకే రియాన్‌ను కూడా మంచి ఆల్‌రౌండర్‌ అని భావిస్తున్నా. రాబోయే ప్రపంచకప్‌లు, ఛాంపియన్స్ ట్రోఫీలో విభిన్నమైన జట్టుతో భారత్‌ బరిలోకి దిగే అవకాశం ఉంది’ అని అన్నాడు.

Also Read: Vivo Y28s 5G Price: వై28ఎస్‌ 5జీ ఫోన్‌ ధరను తగ్గించిన వివో.. ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్స్ అదనం!

‘ప్రస్తుత ప్లేయర్లలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జో రూట్, స్టీవ్ స్మిత్‌ కంటే ట్రావిస్ హెడ్‌ అద్భుతమైన క్రికెటర్. అతడు దూకుడైన ప్లేయర్. యశస్వి జైస్వాల్ కూడా మంచి ఆటగాడే కానీ.. హెడ్‌ అన్ని ఫార్మాట్లలో బెస్ట్‌ బ్యాటర్‌. వన్డేల్లో చాలా తక్కువ అవకాశాలు వచ్చినా వాటిని బాగా సద్వినియోగం చేసుకున్నాడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో మంచి ఇన్నింగ్స్ ఆడడం మనం చూశాం’ అని దినేశ్‌ కార్తీక్ చెప్పుకొచ్చాడు. రిటైర్మెంట్ అనంతరం డీకే వ్యాఖ్యాతగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.