NTV Telugu Site icon

Gudivada: డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు.. గుడివాడ నియోజకవర్గ గ్రామాలకు రక్షిత నీరు

Gudivada

Gudivada

Gudivada: కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో తాగు నీటి సమస్య పరిష్కారం దిశగా అడుగులుపడ్డాయి. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఇటీవల కంకిపాడులో జరిగిన ‘పల్లె పండుగ’ ప్రారంభ కార్యక్రమంలో తన నియోజకవర్గంలోని మూడు మండలాల్లోని 43 గ్రామాల్లో తాగునీటి కలుషిత సమస్యను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి తెచ్చారు. సమస్య తీవ్రతను గుర్తించి వేదిక పైనుంచే దానికి శాశ్వత పరిష్కారం చూపుతామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. ఈ హామీ అమలు మేరకు తర్వాత రోజు నుంచే గుడివాడ నియోజకర్గంలో కలుషిత నీరు బారిన పడిన గ్రామాల్లో రక్షిత మంచినీటి సరఫరా శాఖ యంత్రాంగాన్ని నీటి పరీక్షలు చేయాలని ఆదేశించారు. దాదాపు అన్ని గ్రామాల్లోనూ నీటి పరీక్షలు చేసిన అనంతరం రక్షిత తాగునీరు సరఫరాలోని లోపాలను గుర్తించారు. సత్వరమే పనులు మొదలుపెట్టేందుకుగాను నందివాడ మండలంలో 12 పనులు గుర్తించి రూ.91 లక్షలు కేటాయించారు.

Read Also: AP Crime: ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ దాడి.. ఆరా తీసిన సీఎం చంద్రబాబు

తాగునీటిని శుద్ధి చేసే ఫిల్టర్ బెడ్ల నిర్మాణం, మరమ్మతులు చేసేందుకు నిర్ణయించారు. వెంటనే ఈ పనులు మొదలుపెట్టాలని ఆర్ డబ్ల్యూఎస్ అధికారులకు పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. మిగిలిన గ్రామాల్లో సైతం తాగు నీటి ప్లాంట్ల మరమ్మతులపై దృష్టిపెట్టి వాటికి సంబంధించిన అంచనాలను సత్వరమే రూపొందించాలని స్పష్టం చేశారు. మొదటిగా సమస్య తీవ్రత అధికంగా ఉన్న నందివాడ మండలంలోని పోల సింగవరం, లక్ష్మీనరసింహపురం, జనార్థనపురం, జనార్థనపురం (హెచ్ డబ్ల్యూ), కుదరవల్లి, పెదవిరివాడ, పొనుకుమాడు, వెన్నెనపూడి, రామాపురం, కుదరవల్లి, ఐలపర్రు, నందివాడ గ్రామాల్లో ఫిల్డర్ బెడ్లు, సరఫరాలో లోపం లేకుండా అవసరమైన పనులు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ నిధులు మంజూరు చేశారు.