Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు

Melanoma Cancer Vaccine

Melanoma Cancer Vaccine

Fake Cancer Drugs: క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న బాధితుల బలహీనతను ఆసరాగా చేసుకుని, కోట్లాది రూపాయల దందాకు తెరలేపిన ఒక ఘోరమైన అక్రమ నెట్‌వర్క్‌ను ఢిల్లీ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ బయటపెట్టింది. రూ. 1 లక్ష వరకు వెచ్చించి బాధితులు కొనుగోలు చేస్తున్న ‘ఎవాల్యుమాబ్’ (Avelumab) అనే క్యాన్సర్ నిరోధక ఇంజెక్షన్‌లో కేవలం నీళ్లు మాత్రమే ఉన్నాయని జర్మనీకి చెందిన ‘మెర్క్ ల్యాబ్’ (Merck Lab) పరీక్షల్లో తేలింది. క్యాన్సర్‌తో పోరాడే అసలైన ఔషధ పదార్థం ఇందులో అసలు శూన్యమని వెల్లడైంది. చివరికి రాజస్థాన్ ప్రభుత్వ పథకం కింద ఉచితంగా అందించే క్యాన్సర్ మందులను కూడా ఈ ముఠా అక్రమ మార్గంలో మార్కెట్లోకి తరలించి విక్రయించినట్లు దర్యాప్తులో స్పష్టమైంది.

ఆగస్టు 20న దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాలకు విస్తరించిన దాదాపు రూ. 9 కోట్ల విలువైన ఈ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. మొత్తం 17 మంది నిందితులను అరెస్టు చేయడమే కాకుండా, రూ. 50 లక్షల నగదు, 588 నింపిన యాంటీ-క్యాన్సర్ వైయల్స్ (vials), 6 ఖాళీ వైయల్స్, 7 ఖాళీ బాక్సులు, ఇతర రకాల మందులకు చెందిన 3,021 యూనిట్లను స్వాధీనం చేసుకున్నారు. డార్జాలెక్స్, ఇమ్‌ఫింజి, ఎర్‌బిటక్స్, ఆప్‌డైటా, గాజీవా, బావెన్సియో, అడ్సెట్రిస్, కీట్రూడా వంటి అత్యంత ఖరీదైన క్యాన్సర్ మందులు ఈ ముఠా వద్ద లభించాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై, హైదరాబాద్, హర్యానా, ఉత్తరప్రదేశ్ సహా పలు ప్రాంతాలలో ఈ సిండికేట్ నెట్‌వర్క్ విస్తరించింది. జూన్ 22న వచ్చిన ఒక రహస్య సమాచారం ఆధారంగా తూర్పు ఢిల్లీ, రోహిణి, ముంబై ప్రాంతాలలో అనుమానాస్పద ప్రదేశాలను గుర్తించిన పోలీసులు, జూలై 11న డ్రగ్స్ శాఖతో కలిసి ఏడు బృందాలుగా ఏర్పడి దాడులు నిర్వహించి ఈ భారీ నెట్‌వర్క్‌ను గుట్టురట్టు చేశారు.

ఈ సిండికేట్ ప్రధానంగా మూడు మార్గాల్లో మందులను సేకరించేది. మొదటిది అక్రమ వనరుల నుంచి నకిలీ మందులను కొనుగోలు చేయడం, రెండోది ఆసుపత్రులలో క్యాన్సర్ రోగుల కోసం కేటాయించిన మందులను అక్రమంగా పక్కదారి పట్టించడం, మూడోది ప్రభుత్వ సంస్థలు, గోదాముల నుంచి లబ్ధిదారులకు వెళ్లాల్సిన మందులను దొంగిలించడం. ఎలాంటి చెల్లుబాటు అయ్యే బిల్లులు, కొనుగోలు రికార్డులు, డ్రగ్ లైసెన్సులు లేకుండా సాధారణ ఇళ్లలో, రహస్య స్థావరాలలో ఈ మందులను భద్రపరిచి దళారుల ద్వారా విక్రయించేవారు. ఒరిజినల్ కార్టన్లు, ఖాళీ పెట్టెలను సేకరించి, వాటిపై ఉన్న బ్యాచ్ నంబర్లు, గరిష్ట అమ్మకపు ధర (MRP) వివరాలను ‘ఎసిటోన్’ వంటి రసాయనాలతో చెరిపివేసేవారు. అనంతరం థర్మోకోల్ బాక్సులు, బబుల్ రోల్స్, ప్లాస్టిక్ కవర్లతో సరికొత్తగా ప్యాకింగ్ చేసి మార్కెట్లోకి వదిలేవారు. ఈ లావాదేవీలకు సంబంధించిన డైరీలు, రిజిస్టర్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో లక్ష్మీనగర్‌కు చెందిన అభిషేక్ వైశ్య, శుభమ్ కుమార్ చౌదరి, సూరజ్ చౌదరీలు ఉన్నారు. 2022 నుంచి ఈ వ్యాపారంలో ఉన్న అభిషేక్ వద్ద రూ. 4 లక్షలు, శుభమ్ వద్ద రూ. 23 లక్షలు దొరికాయి. నోయిడాకు చెందిన ఆనంద్ కుమార్ వద్ద 337 వైయల్స్, ఫరీదాబాద్‌కు చెందిన దీపక్ అలియాస్ రవి వద్ద 108 వైయల్స్ సహా రూ. 6.5 లక్షలు, గుర్గావ్‌కు చెందిన మయాంక్ గార్గ్ వద్ద 55 వైయల్స్ దొరికాయి. జూలై 12న క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు కాగా, అసలు ఈ నకిలీ, లీకైన ప్రభుత్వ మందులు ఎంతకాలంగా మార్కెట్‌లో చెలామణి అవుతున్నాయి, దీని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.