Food Delivery: జొమాటో, స్విగ్గీలకు ఊహించని షాక్.. ఫుడ్ డెలివరీ రేసులోకి అడుగుపెట్టిన ‘షాపింగ్’ కింగ్..

Food Delivery

Food Delivery

వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్.. స్విగ్గీ, జొమాటోలకు పోటీగా బెంగళూరులో త్వరలోనే తన ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఆగస్టు 15 నాటికి ఈ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీనికోసం కంపెనీ ఇప్పటికే నగరవ్యాప్తంగా ఉన్న రెస్టారెంట్ భాగస్వాములను చేర్చుకోవడం ప్రారంభించింది. ఇతర ప్లాట్‌ఫారమ్‌లు సాధారణంగా 16 నుంచి 30 శాతం వరకు కమిషన్ వసూలు చేస్తుండగా, ఫ్లిప్‌కార్ట్ మాత్రం కేవలం 10 శాతం కమిషన్‌నే ఆఫర్ చేస్తూ రెస్టారెంట్లను ఆకట్టుకుంటోంది.

కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) ఆధారంగా ఫ్లిప్‌కార్ట్ ఈ సేవలను అందిస్తోంది. ఈ ఫుడ్ డెలివరీ సేవలు ఫ్లిప్‌కార్ట్ ప్రధాన యాప్‌తో పాటు, ప్రత్యేకంగా ఉండే ఒక స్టాండ్‌అలోన్ యాప్ ద్వారా కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ CEO కళ్యాణ్ కృష్ణమూర్తి మాజీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆశిష్ విజయ్‌వర్గియా ఈ ప్రాజెక్ట్‌కు నాయకత్వం వహిస్తున్నారు.

ఇటీవల రాపిడో ‘ఓన్లీ’ పేరుతో జీరో-కమిషన్ మోడల్‌లో రోజుకు 40,000 పైగా ఆర్డర్లతో బెంగళూరు మార్కెట్లో వేగంగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ తక్కువ కమిషన్ వ్యూహంతో మార్కెట్లోకి అడుగుపెట్టడం విశేషం. ప్రారంభంలో బెంగళూరులో పరిమిత వినియోగదారులతో ఈ సేవలను పైలట్ ప్రాజెక్ట్‌గా పరీక్షించి, వినియోగదారుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఇతర నగరాలకు విస్తరించాలని సంస్థ భావిస్తోంది. గత కొంతకాలంగా స్విగ్గీ, జొమాటోల మధ్య మాత్రమే సాగుతున్న ఫుడ్ డెలివరీ పోటీలోకి రాపిడో, ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ వంటి దిగ్గజాలు రావడం ఈ రంగాన్ని మరింత ఆసక్తికరంగా మార్చింది.