దేశ రాజధాని ఢిల్లీలో సీజేపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనలు ఉధృతం అవుతున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. అల్లర్లకు పాల్పడినట్లు గుర్తించిన వ్యక్తులపై క్రిమినల్ కేసులతో పాటు వారి పాస్పోర్ట్ రద్దు ప్రక్రియను కూడా ప్రారంభించనున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. హింసాత్మక నిరసనల్లో పాల్గొన్న వారిపై చట్టపరమైన చర్యలతో పాటు పరిపాలనా పరమైన చర్యలు కూడా తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.
గత సోమవారం సీజేపీ నిర్వహించిన ‘చలో సంసద్’ ర్యాలీలో నిరసనకారులు పార్లమెంట్ భద్రతా బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడం, లాఠీచార్జ్ చేయడం, అల్లర్ల నియంత్రణ వాహనాలను వినియోగించడం జరిగింది. ఈ ఘటనల్లో పలువురు నిరసనకారులు, పోలీసు సిబ్బంది స్వల్పంగా గాయపడ్డారు. అదే సమయంలో తమ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సీజేపీ ఆరోపించింది.
జూలై 24న దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపు
ఇదిలా ఉండగా పోలీసుల చర్యలకు నిరసనగా జూలై 24న దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలు నిర్వహించాలని సీజేపీ పిలుపునిచ్చింది. ప్రతి జిల్లాలో విద్యార్థులపై జరిగిన పోలీసు దాడులను నిరసిస్తూ ఆందోళనలు చేపట్టాలని పార్టీ కోరింది. విద్యార్థి సంఘాలు, యువజన సంస్థలు స్థానికంగా సమన్వయం చేసుకుని విద్యార్థుల డిమాండ్లను ప్రజలకు వివరించాలని, పోలీసు చర్యలకు గురైన విద్యార్థులకు సంఘీభావం ప్రకటించాలని పార్టీ విజ్ఞప్తి చేసింది.
ఆందోళనలకు పెరుగుతున్న మద్దతు
ఇటీవల జంతర్మంతర్ దగ్గర పరిమిత స్థాయిలోనే నిరసనలు కొనసాగాయి. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అయితే సోమవారం విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బుధవారం నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత జంతర్మంతర్కు చేరుకుని నిరసనల్లో పాల్గొంటున్నారు. పోలీసుల లాఠీచార్జ్ వీడియోలు చూసిన తర్వాతే తాము ఉద్యమంలో చేరినట్లు పలువురు నిరసనకారులు తెలిపారు. పాల్గొంటున్న వారి సంఖ్యను అంచనా వేయడం కూడా కష్టంగా మారిందని సీజేపీ నిర్వాహకులు పేర్కొన్నారు. ఇక విద్యార్థుల ఉద్యమానికి దేశ వ్యాప్తంగా అనూహ్యంగా మద్దతు లభిస్తుంది. విపక్ష పార్టీలతో పాటు సినీ, క్రికెటర్ల నుంచి మద్దతు లభిస్తుంది. సినీనటులు ప్రత్యక్ష పోరాటంలో కూడా పాల్గొంటున్నారు.
రాజకీయంగా వేడెక్కిన వివాదం
విద్యార్థుల ఆందోళన రాజకీయంగానూ తీవ్ర చర్చకు దారితీసింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. నీట్ అంశంపై పార్లమెంట్లో చర్చకు ప్రభుత్వం అంగీకరించినప్పటికీ రాహుల్ గాంధీ తన మాట నిలబెట్టుకోలేదని ఆరోపించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం నిరసనలను మరింత ఉధృతం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారిక నివాసం 7, లోక్ కళ్యాణ్ మార్గ్ ఎదుట కాంగ్రెస్ ఎంపీలు, సీనియర్ నేతలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు, నీట్ పేపర్ లీక్ అంశంపై పార్లమెంట్లో చర్చ జరపాలని, విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యలపై స్వతంత్ర విచారణ చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ ఘటనకు బాధ్యత వహించాలని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.

