డబ్ల్యూపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్కు దూసుకెళ్లింది. చివరి లీగ్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ముంబై ఇండియన్స్ ఓడిపోవడంతో.. ఢిల్లీ ఫైనల్ బెర్తు దక్కించుకుంది. ఇరు జట్లు 10 పాయింట్లతో సమానంగా ఉన్నప్పటికీ.. ముంబై (0.192) కంటే మెరుగైన రన్రేట్ ఉన్న ఢిల్లీ (0.396) తుది పోరుకు అర్హత సాధించింది. ఢిల్లీకి ఇది వరుసగా మూడో ఫైనల్ కావడం విశేషం. మరోవైపు గురువారం గుజరాత్ జెయింట్స్తో జరిగే ఎలిమినేటర్లో ముంబై తలపడనుంది. ఎలిమినేటర్లో గెలిచిన టీమ్.. ఫైనల్లో ఢిల్లీతో తలపడనుంది.
డబ్ల్యూపీఎల్లో లీగ్ మ్యాచ్లు ముగిసేసరికి అగ్రస్థానంలో నిలిచిన టీమ్ నేరుగా ఫైనల్ చేరుతుంది. తర్వాతి రెండు స్థానాల్లో నిలిచే టీమ్స్ ఎలిమినేటర్ మ్యాచ్ ఆడతాయి. ఎలిమినేటర్లో గెలిచిన టీమ్ ఫైనల్ చేరుతుంది. లీగ్ దశలో 8 మ్యాచ్లు ఆడిన గుజరాత్ 8 పాయింట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. ఢిల్లీ 8 మ్యాచ్ల్లో 10 పాయింట్లు, ముంబై 8 మ్యాచ్ల్లో 10 పాయింట్లు సాధించి టాప్-2లో ఉన్నాయి. మెరుగైన రన్రేట్తో ఢిల్లీ ఫైనల్కు చేరింది.
డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయంతో టోర్నీని ముగించింది. మంగళవారం ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ను 11 పరుగుల తేడాతో ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 3 వికెట్లకు 199 పరుగులు చేసింది. స్మృతి మంధాన (53; 37 బంతుల్లో 6×4, 3×6) హాఫ్ సెంచరీ చేయగా.. ఎలీస్ పెర్రీ (49 నాటౌట్; 38 బంతుల్లో 5×4, 1×6) దూకుడుగా ఆడింది. ఛేదనలో ముంబై 9 వికెట్లకు 188 పరుగులే చేసి ఓడింది. నాట్ సీవర్ (69; 35 బంతుల్లో 9×4, 2×6) మెరిసినా ముంబైకి ఓటమి తప్పలేదు. స్నేహ్రాణా (3/26), ఎలీస్ పెర్రీ (2/53) మెరిశారు.