Site icon NTV Telugu

David Miller: డ్రామా, థ్రిల్లర్, చివరికి నిరాశ.. ఆ చివరి ఓవర్‌లో అసలేం జరిగింది? మిల్లర్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కి పాల్పడ్డాడా?

Miller

Miller

David Miller: నిన్న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ (DC), గుజరాత్ టైటాన్స్ (GT) చేతిలో కేవలం ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. చివరి ఓవర్‌లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఆఖరి ఓవర్‌లో రెండు బంతులకు రెండు పరుగులు కావాల్సిన సమయంలో మిల్లర్ పెను సాహసం చేశాడు. ఐదో బంతికి సింగిల్ తీసే అవకాశం ఉన్నా.. తానే మ్యాచ్ ముగించాలనే నమ్మకంతో నిరాకరించాడు. కానీ, ఆఖరి బంతిని ప్రసిద్ధ్ స్లోయర్ బౌన్సర్‌గా వేయడంతో మిల్లర్ కనెక్ట్ చేయలేకపోయాడు. బై రన్ కోసం ప్రయత్నించిన క్రమంలో కీపర్ జోస్ బట్లర్ డైరెక్ట్ హిట్‌తో నాన్ స్ట్రైకర్ విప్రాజ్ నిగమ్‌ను రనౌట్ చేయడంతో ఢిల్లీ 209 పరుగులకే పరిమితమైంది.

READ MORE: Pakistan Fuel Prices: పాకిస్థాన్‌లో ఇంధన ధరల పెరుగుదల.. లాహోర్‌లో ఆటో డ్రైవర్ల నిరసన

వాస్తవానికి, మిల్లర్ విధ్వంసకర ప్లేయర్. ఐపీఎల్‌లో ఎన్నో మ్యాచులు తాను ముందుండి గెలిపించాడు. డేవిడ్ మిల్లర్ ఐపీఎల్ (IPL) చరిత్రలో అత్యంత విశ్వసనీయమైన ఫినిషర్‌గా గుర్తింపు పొందాడు. పంజాబ్ కింగ్స్ (2012-2019)తో ప్రయాణం మొదలుపెట్టి, రాజస్థాన్ రాయల్స్ (2020-2021), గుజరాత్ టైటాన్స్ (2022-2024)లలో కీలక పాత్ర పోషించాడు. 2022లో గుజరాత్ ఛాంపియన్‌గా నిలవడంలో 481 పరుగులతో కీలక పాత్ర పోషించాడు. ఒకానొక సందర్భంలో మిల్లర్ క్రీజ్‌లో ఉన్నాడంటే బౌలర్లకు దడ పుట్టేది. ఏ బంతిని ఎలా కొడతాడో తెలియక సతమతమై పోయే వాళ్లు. అలాంటి స్టార్ బ్యాట్స్‌మెన్ చివరి ఓవర్‌లో ఇలా చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో మిల్లర్ తీరుపై ఢిల్లీ ఫ్యాన్స్ తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ఐదో బంతికి సింగిల్ తీసే అవకాశం ఉన్నా తీయకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మిల్లర్‌ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. సోషల్ మీడియాలో ఈ అంశంపై రచ్చ జరుగుతోంది. రెండు బాల్స్‌లో కేవలం రెండు పరుగులు సైతం సాధించని స్థితిలో మిల్లర్ ఉన్నాడా? అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే.. మ్యాచ్ అనంతరం మిల్లర్ కన్నీరు పెట్టాడు. తానే చేజేతులారా మ్యాచ్‌ను ఓడించాని బాధపడ్డాడు. అక్షర్ పటెల్ వచ్చి మిల్లర్‌ను ఓదార్చాడు.

Exit mobile version