Kailash Gahlot: ముగిసిన కైలాష్ గహ్లోట్ ఈడీ విచారణ.. మీడియాతో ఏమన్నారంటే..!

Kilesh

Kilesh

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట ఢిల్లీ మంత్రి కైలాష్ గహ్లాట్ హాజరయ్యారు. దాదాపు 5 గంటల పాటు ఆయన్ను ఈడీ అధికారులు విచారించారు. విచారణ అనంతరం కైలాష్ మీడియాతో మాట్లాడారు. ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు తాను జవాబు ఇచ్చినట్లు తెలిపారు.

గోవా ఎన్నికల్లో తాను ఎప్పుడు పాల్గొనలేదని ఆయన తెలిపారు. తనకు ప్రభుత్వ బంగ్లా కేటాయించినా.. భార్య, పిల్లల కోసం వసంత్‌కుంజ్‌లోని ప్రైవేట్ నివాసంలో ఉంటున్నట్లు చెప్పారు. తనను ఎలాంటి క్రాస్ క్వశ్చన్లు వేయలేదని వెల్లడించారు. ఈడీ రెండు సార్లు సమన్లు జారీ చేసిందని.. అప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరగడం వల్ల కొంత సమయం ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. తాజా నోటీసుల నేపథ్యంలో శనివారం ఈడీ విచారణకు హాజరయ్యానని పేర్కొన్నారు. అసలు తాను గోవా ఎన్నికల్లో పాల్గొన్నదే లేదని ఆయన తేల్చిచెప్పారు.

ఇది కూడా చదవండి: Andhra Pradesh: వాలంటీర్ల విధులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. అనంతరం న్యాయస్థానంలో హాజరపరచగా ఏప్రిల్ 1 వరకు ఈడీ కస్టడీ పొడిగించింది. మరోవైపు అరెస్ట్, ఈడీ కస్టడీ నుంచి రక్షణ కల్పించాలని హైకోర్టును కోరగా నిరాశ ఎదురైంది. ఇదిలా ఉంటే కేజ్రీవాల్ అరెస్ట్‌ను అమెరికా సహా ఐక్య రాజ్య సమితి తప్పు పట్టాయి.

ఇది కూడా చదవండి: Vijayasai Reddy: సిద్ధాంతం, నైతిక విలువలు లేని పార్టీ టీడీపీ.. విజయసాయి సంచలన వ్యాఖ్యలు

ఇక కేజ్రీవాల్ అరెస్ట్‌ను నిరసిస్తూ ఆదివారం ఇండియా కూటమి పెద్ద ఎత్తున మహా ర్యాలీకి సిద్ధపడింది. కేంద్రం తీరును ఈ సందర్భంగా ఎండగట్టనున్నారు. ఈ ర్యాలీలో ఇండియా కూటమిలో ఉన్న నేతలంతా హాజరు కానున్నారు. ఇదిలా ఉంటే శనివారం ఢిల్లీలో సునీతా కేజ్రీవాల్‌ను జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ భేటీ అయ్యారు. ఇద్దరు కలిసి పోరాడాలని నిర్ణయం తీసుకున్నారు.