Rajasthan: పోలీసుల కళ్లలో కారం కొట్టి గ్యాంగ్‌స్టర్ హత్య.. సినిమాను తలపించిన ఘటన

Rajasthan

Rajasthan

Rajasthan: రాజస్థాన్‌లో సినీ ఫక్కీలో ఓ నిందితుడి హత్య జరిగింది. చాలా సినిమాల్లో ఇలాంటి ఘటనలు చూసే ఉంటాం. నిందితుడు ఓ కేసులో ఇరుక్కుంటే.. అతడి వల్ల వారు పట్టుబడుతారేమోనని పోలీసుల ఎదుటే చంపేస్తారు. అలాంటి ఘటనే తాజాగా రాజస్థాన్‌లో జరిగింది. పోలీసుల కళ్లలో కారంకొట్టి వారి కస్టడీలోని నిందితుడిని నేరస్థులు కాల్చి చంపిన ఘటన భరత్‌పూర్‌లో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే.. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో హత్య కేసులో నిందితుడు గ్యాంగ్‌స్టర్ కుల్దీప్ జఘినాను పోలీసులు బుధవారం కోర్టులో హాజరుపరచాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు అతడిని కోర్టుకు తీసుకెళ్తుండగా.. కొందరు నేరగాళ్లు అతడిని దారుణంగా హత్య చేశారు. నేరగాళ్లు పోలీసుల కళ్లలో కారం కొట్టి, పరిస్థితిని అవకాశంగా తీసుకుని గ్యాంగ్‌స్టర్‌ను కాల్చిచంపారు.

Read Also: Bengaluru: టెక్‌ కంపెనీ సీఈవో, ఎండీ హత్య కేసు.. దారుణంగా హతమార్చిన ముగ్గురు అరెస్ట్‌

పోలీసులు గ్యాంగ్‌స్టర్‌ను జైపూర్ జైలు నుంచి భరత్‌పూర్ కోర్టుకు తీసుకెళ్తుండగా ఈ కాల్పులు జరిగాయి. నేరగాళ్లు రాగానే వెంటనే పోలీసుల కళ్లలో కారం కొట్టారు. దీంతో వారి కళ్లలో మంటలు పుట్టడంతో, ఇదే అదనుగా భావించి నేరస్థులు ఆ గ్యాంగ్‌స్టర్‌ను కాల్చి చంపేశారు. మృతుడు కుల్దీప్ ఓ హత్య కేసులో ఇరుక్కుని జైలుకెళ్లాడు. జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై అమోలి టోల్ ప్లాజా సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఈ హత్యను సీరియస్‌గా తీసుకున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.