Telangana Congress: ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌..! కాంగ్రెస్‌లో ఎంపీ సీటు కోసం భారీగా దరఖాస్తులు..

Cong

Cong

Telangana Congress: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ.. ఇప్పుడు త్వరలోనే జరగనున్న లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్‌ పెట్టింది.. కేంద్రంలో కాంగ్రెస్‌ సర్కార్‌ ఉంటేనే.. రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా బాగుంటుందని ప్రచారం మొదలు పెట్టింది.. మరోవైపు.. అభ్యర్థులను నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది.. అయితే, కాంగ్రెస్‌ పార్టీ నుంచి లోక్‌సభ బరిలో దిగేందుకు భారీగా పోటీ కనిపిస్తోంది.. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు గాను.. 306 మంది అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్నారు.. ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ గడువు ఈ రోజు సాయంత్రంతో ముగిసింది. మొత్తం 306 అప్లికేషన్లు వచ్చాయని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.. అయితే, చివరి రోజు అయిన శనివారం ఒక్కరోజే 166 మంది దరఖాస్తు చేసుకున్నారు.

Read Also: Ponguleti Srinivas Reddy : రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేయడానికి ప్రభుత్వం తగు చర్యలు

ఖమ్మం లోక్‌ సభ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని, భువనగిరి నుంచి పీసీసీ ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి, సికింద్రాబాద్‌ సీటు కోసం డాక్టర్‌ రవీందర్‌ గౌడ్‌, వేణుగోపాల్‌ స్వామి, పెద్దపల్లి నుంచి గడ్డం వివేక్‌ కుమారుడు గడ్డం వంశీ, వరంగల్‌ నుంచి మోత్కుపల్లి నర్సింహులు.. మల్కాజ్‌గిరి నుంచి బండ్ల గణేష్‌, ఖమ్మం నుంచి టీపీసీసీ మాజీ కార్యనిర్వాహక అధ్యక్షులు జెట్టి కుసుమ కుమార్.. నాగర్‌కర్నూల్‌ నుంచి మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్, ఆయన కుమార్తె చంద్రప్రియ, మల్కాజ్‌గిరితో పాటు వరంగల్, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్‌ నుంచి కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, తెలంగాణ మాజీ హెల్త్‌ డైరెక్టర్‌ గడల శ్రీనివాసరావు ఇలా ప్రముఖులు సైతం కాంగ్రెస్‌ టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు.. మరి టికెట్‌ దక్కేది ఎవరికో మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.