Abhijit Dipke: భారతదేశ డిజిటల్ ప్రపంచంలో సరికొత్త సెన్సేషన్ సృష్టిస్తూ, దేశ యువతను అమితంగా ఆకట్టుకుంటున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) చుట్టూ ఇప్పుడు తీవ్ర వివాదం నడుస్తోంది. ఈ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తన సోషల్ మీడియా ఖాతాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. తన వ్యక్తిగత ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాకింగ్కు గురైందని, అలాగే ఆన్లైన్లో విపరీతమైన ఆదరణ పొందుతున్న తమ పార్టీ బ్యాకప్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను సైతం కాసేపు తొలగించి, కొన్ని గంటల తర్వాత మళ్లీ పునరుద్ధరించారని వెల్లడించారు. తన వ్యక్తిగత ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అవ్వడం వల్ల దాని యాక్సెస్ను పూర్తిగా కోల్పోయినట్లు దీప్కే తెలిపారు. సోషల్ మీడియాలో రాజకీయ సంభాషణలను శాసిస్తున్న ఈ వ్యంగ్య (సటైరికల్) యువజన ఉద్యమ మద్దతుదారుల్లో ఈ పరిణామం తీవ్ర ఆందోళన కలిగించింది. మెటా రికవరీ ప్రాసెస్ ద్వారా తన అకౌంట్ను తిరిగి పొందేందుకు దీప్కే పదేపదే ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. రికవరీ ఆప్షన్పై క్లిక్ చేసిన ప్రతిసారీ.. “మీ భద్రత కోసమే అకౌంట్ను లాక్ చేశాం. దీనిని తిరిగి పొందాలంటే మీ గుర్తింపును నిరూపించుకుని, కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేయాలి” అనే మెసేజ్ మాత్రమే వస్తోందని, ఎన్నిసార్లు ప్రయత్నించినా అకౌంట్ ఓపెన్ కావడం లేదని కొన్ని స్క్రీన్షాట్లను షేర్ చేస్తూ వాపోయారు.
ఈ ఇన్స్టాగ్రామ్ వివాదానికి ముందే, ఈ వారంలోనే కాక్రోచ్ జనతా పార్టీ అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) హ్యాండిల్ను భారతదేశంలో నిలిపివేస్తూ (విత్హెల్డ్) కఠిన చర్యలు తీసుకున్నారు. అయితే, ఈ దెబ్బకు ఏమాత్రం వెనక్కి తగ్గని ఈ డిజిటల్ ఆర్మీ.. వెంటనే “కాక్రోచ్ ఈజ్ బ్యాక్” పేరుతో సరికొత్త అకౌంట్తో ప్రత్యక్షమైంది. “మమ్మల్ని వదిలించుకోవచ్చని అనుకున్నారా? లోల్ (Lol)” అంటూ తమను అణచివేయాలని చూసే విమర్శకులను గేలి చేస్తూ పోస్టులు పెట్టింది. ఇన్స్టాగ్రామ్లో దేశంలోని పెద్ద పెద్ద రాజకీయ పార్టీలను వెనక్కి నెట్టి తాము దూసుకుపోతుండటం వల్లే.. తమ గొంతు నొక్కడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారంటూ హింట్ ఇచ్చింది. ఇక, కేవలం కొన్ని రోజుల క్రితం ఒక చిన్న ఇంటర్నెట్ సటైర్ (వ్యంగ్య) ప్రచారంగా మొదలైన ఈ కాక్రోచ్ జనతా పార్టీ, ఇప్పుడు దేశంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న డిజిటల్ రాజకీయ ఉద్యమంగా రూపాంతరం చెందింది. ఈ సరికొత్త పార్టీ కేవలం కొద్ది రోజుల్లోనే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్యలో అధికార బీజేపీని, ఆ తర్వాత 141 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని కూడా దాటేసి.. దేశంలోనే అత్యధిక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉన్న పొలిటికల్ గ్రూప్గా అవతరించి రికార్డు సృష్టించింది.
